తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌ గడువును మే 7 వరకు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ, కామారెడ్డి జిల్లాలో మాత్రం కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అధికారుల కళ్లుగప్పి యద్దేచ్ఛగా తమ కార్యాకలాపాలు నిర్వహించేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో అక్రమంగా సిమెంట్ లారీలు రవాణా సాగిస్తున్నాయి. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి సూర్యాపేట పరిసర ప్రాంతాల్లోని సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి ఐదు లారీల వరకు సిమెంటును సరఫరా చేసినట్లుగా స్థానికులు గుర్తించారు. స్థానికంగా ఉన్న ఓ వ్యాపారి సిమెంట్ను తన ఇంటి వద్ద ఈ రోజు తెల్లవారుజామున లోడ్ చేయించుకున్నట్లుగా ప్రజలు ఆరోపించారు. సూర్యాపేట పరిసరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయని, ఆ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉన్నందున లారీల రవాణాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అర్ధరాత్రి అక్రమంగా సిమెంట్ సరఫరా సాగించటం కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటూ నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు లారీల రవాణాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాప్ యజమాని ఇంటిని, షాపును తనిఖీ చేశారు. సిమెంట్ సరఫరా జరిగిన సంగతి వాస్తవమేనని గ్రహించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.