కరోనా మహామ్మారిపై జరుగుతున్న పోరాటంలో ఫ్రంట్ వారియర్స్గా ప్రాణాలకు తెగించి వార్డుల్లో సేవలందిస్తున్న వైద్యులను వైరస్ కాటువేస్తోంది. ఈ మహమ్మారి వేటుకు బలైపోయిన ఓ డాక్టర్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయంప్రకటించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. తానే స్వయంగా వారి ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు. మృతిచెందిన డాక్టర్ కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..
దేశ రాజధాని ఢిల్లీలోని లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో అనస్తీషియాలజిస్ట్గా పని చేస్తున్న ఓ వైద్యుడు ఇటీవల కోవిడ్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. 52 ఏళ్ల అసీమ్ గుప్తా అనే వైద్యుడు అక్కడ కరోనా వార్డులోని పేషెంట్లకు చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషించారు. కరోనాతో ఊపిరాడక ఆరోగ్యం విషమించే సమయంలో వెంటిలేటర్ పెట్టాల్సి రావటం.. అనస్తీషియా వైద్యుడు తప్పనిసరి అవసరం ఉంటుంది. నేరుగా పేషెంట్లతో కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దృష్టవశాత్తు డాక్టర్ అసీమ్ గుప్తాకు వైరస్ సోకింది. జూన్ 6న ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తొలుత మైల్డ్ సింప్టమ్స్ ఉండడంతో క్వారంటైన్లోకి వెళ్లారు. అయితే తర్వాతి రోజుకే గుప్తా ఆరోగ్యం విషమించింది. దీంతో జూన్7న ఆయన పని చేసే ఆస్పత్రిలోనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తరలించారు.. పరిస్థితి మరింత క్షీణించడంతో ఢిల్లీ సాకేత్లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా..చికిత్స పొందుతూ అక్కడే ఆయన ప్రాణాలను కోల్పోయారు.
డాక్టర్ అసీమ్ గుప్తా కరోనా బాధితులకు సేవలందిస్తూ…మృతిచెందిన నేపథ్యంలో రూ.కోటి పరిహారం ప్రకటించారు సీఎం కేజ్రీవాల్. ఇచ్చిన మాట మేరకు శుక్రవారం ఉదయం డాక్టర్ అసీమ్ గుప్తా ఇంటికి వెళ్లి దానికి సంబంధించిన చెక్ అందించారు. ఈ సందర్భంగా అసీమ్కు నివాళి అర్పించిన సీఎం కేజ్రీవాల్.. అసీమ్ గుప్తాను పీపుల్స్ డాక్టర్గా అభివర్ణించారు. ఇతరుల కోసం ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలందించిన వారి కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యం అని కేజ్రివాల్ పేర్కొన్నారు.