ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ 21వేల మందికి పైగా పొట్టన పెట్టుకుంది. అంతేకాదు.. మరో 5లక్షల మంది ఈ వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. ఈ మహమ్మారి చైనాలోని వుహాన్ పట్టణంలో పురుడుపోసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి నుంచి అది ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించింది. దీనికి విరుగుడు మందు లేకపోవడంతో.. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రస్తుతం అన్ని దేశాలు ఈ కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ఇంతకు ముందే వ్యాక్సిన్ కనక్కున్నారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ఔషధ పరీక్షలను చూస్తే నిజమేనేమో అనిపిస్తోంది.
అక్కడి సైంటిస్టులు.. పలు ప్రయోగాలు చేపట్టిన అనంతరం.. కనిపెట్టిన ఓ వ్యాక్సిన్ను క్లినికల్ టెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సినేషన్ను వివిద దశల్లో చేపట్టనుండగా, మొదటి దశకోసం ఏకంగా 5 వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకున్నట్లు బీజింగ్ న్యూస్ వెల్లడించింది. దీన్ని ఓపెన్ అండ్ డోస్ ఎస్కలేషన్ ఫస్ట్ స్టేజ్ గా పిలుస్తున్నారు.
ఆరోగ్యంగా ఉన్న 18–60 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి ఈ వ్యాక్సిన్ ను క్లినికల్ ట్రయల్ కింద ఇవ్వనున్నారు. దీనికోసం చైనాలోని అకాడెమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ నిపుణులు.. దీనికి కావాల్సిన అనుమతులను ఈ నెల 16వ తేదీనే పొందినట్లు తెలుస్తోంది. ఈ పరిశోధనలు.. దాదాపు ఆర్నెళ్ల పాటుగా సాగనున్నట్లు వెల్లడించారు. వైరస్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన హుబే ప్రావిన్స్లోని వుహాన్లోనే ఈ క్లినికల్ ట్రయల్ను కొనసాగించనున్నారు. ఫస్ట్ స్టేజ్ లోవ్యాక్సిన్ పొందిన వారిని.. 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచిన తర్వాత.. వారి వారి హెల్త్ కండిషన్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేయనున్నారు.
కాగా.. ఏప్రిల్ నెలాఖరు కల్లా ప్రీ–క్లినికల్ స్టేజ్ లను పూర్తి చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.