
హైదరాబాద్, సెప్టెంబర్ 4: అసలు UPSC ఇంటర్వ్యూకు ముందు కృష్ణ తేజ హైదరాబాద్లో ఓ మాక్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఆయన గుంటూరు జిల్లాకు చెందినవారు కావడంతో.. ఇంటర్వ్యూ ప్యానెల్ పొగాకు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ‘గుంటూరు పొగాకుకు ప్రసిద్ధి కదా.. సిగరెట్ తాగడం సరైనదా? తప్పా?’ అని ప్రశ్నించింది. అందుకు ఆయన సిగరెట్ తాగడం తప్పని సమాధానం ఇచ్చారు. అయితే ప్యానెల్ సభ్యులు దానిని వ్యక్తిగత హక్కుగా సమర్థిస్తూ వాదనకు దిగారు. దీంతో దాదాపు అరగంట పాటు మాక్ ఇంటర్వ్యూ మొత్తం సిగరెట్ తాగడం సరైనదా? కాదా? అనే అంశంపైనే సాగింది. ఆ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత తాను సరిగ్గా చేయలేకపోయానని కృష్ణ తేజ భావించారు.
మాక్ ఇంటర్వ్యూ తర్వాత రోజు అసలు ఇంటర్వ్యూ ఉండటంతో.. అంతకుముందు రోజు సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించానని కృష్ణ తేజ చెప్పారు. ‘ఇంటర్వ్యూలో ఏ ప్రశ్న అయినా అడగండి.. సమాధానం చెబుతాను. కానీ ఈ సిగరెట్, పొగాకు విషయం మాత్రం అడగొద్దు’ అని స్వామిని కోరుకున్నానని ఆయన సరదాగా గుర్తుచేసుకున్నారు. కానీ మరుసటి రోజు ఇంటర్వ్యూ మొదలైన కొద్దిసేపటికే ఊహించని విధంగా అదే అంశం మళ్లీ ఎదురైంది.
ఇంటర్వ్యూయర్ మొదట కృష్ణ తేజ ఏ జిల్లాకు చెందినవారని అడిగారు. ఆయన గుంటూరు జిల్లా అని చెప్పగానే.. ‘గుంటూరు దేనికి ఫేమస్?’ అని ప్రశ్నించారు. అప్పుడు కృష్ణ తేజ ముందుగా మిర్చి, రెడ్ చిల్లీస్కు గుంటూరు ప్రసిద్ధి అని చెప్పారు. అయితే ప్యానెల్ సభ్యుడు మళ్లీ ప్రశ్నను కొనసాగిస్తూ.. గుంటూరు మరో దేనికి ప్రసిద్ధి అని అడిగారు. దీంతో చివరకు పొగాకు పేరును చెప్పక తప్పలేదు.
ఆ తర్వాత ప్యానెల్ మరో కీలక ప్రశ్న వేసింది. ‘మీరు గుంటూరు జిల్లా కలెక్టర్ అయితే పొగాకును నిషేధిస్తారా? లేక ప్రోత్సహిస్తారా?’ అని అడిగారు. ఈ ప్రశ్నకు కృష్ణ తేజ వెంటనే నిర్ణయం తీసుకోకుండా కాసేపు ఆలోచించారు. ఆ తర్వాత ఒక ప్రణాళికను వివరించారు. ‘వెంటనే పొగాకును నిషేధించను. ఐదేళ్ల రోడ్మ్యాప్ రూపొందిస్తాను. ప్రతి ఏడాది కొంతమేర సాగును తగ్గిస్తూ.. అదే సమయంలో పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తాను. ఐదేళ్లలో క్రమంగా పొగాకు సాగును సున్నాకు తీసుకువస్తాను’ అని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా పొగాకు వినియోగానికి అలవాటు పడిన వారికి కూడా పునరావాసం కల్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కసారిగా పొగాకును నిషేధిస్తే అనేక మంది రైతులు, వారి కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని.. అందుకే దశలవారీగా మార్పు తీసుకురావాలని వివరించారు. ఈ సమాధానంలో ప్యానెల్కు ఆయనలోని పరిపక్వత, నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితులను విశ్లేషించే విధానం కనిపించిందని కృష్ణ తేజ తెలిపారు.
కృష్ణ తేజ ఇంటర్వ్యూ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన సంఘటన కూడా ఉంది. ఆయన తన సన్నిహిత స్నేహితుడు హరితో కలిసి చదువుకునేవారు. ఉదయాన్నే జాగింగ్కు వెళ్లడం, కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం, ఆ తర్వాత చదువుకోవడం.. ఇలా ఇద్దరూ తరచూ చర్చించుకునేవారు. ఓ రోజు బైక్పై నీలోఫర్ కేఫ్కు వెళ్తుండగా హరి ఓ మాట చెప్పాడు. ‘నీకు లీ క్వాన్ యూపై ప్రశ్న అడుగుతారేమో.. నువ్వు చదువుకో’ అని సూచించాడు. అప్పటివరకు లీ క్వాన్ యూ గురించి పెద్దగా తెలియని కృష్ణ తేజ.. ఆ రోజు రాత్రే ఆయన గురించి సమగ్రంగా చదివి నోట్స్ తయారు చేసుకున్నారు.
అసలు ఇంటర్వ్యూలో చివర్లో దాదాపు 75 ఏళ్ల వయసున్న సీనియర్ ఇంటర్వ్యూయర్ ఒకరు కృష్ణ తేజను ఉద్దేశించి.. ‘నేను నిన్ను చాలా కఠినమైన ప్రశ్న అడుగుతాను. తెలుసుంటే చెప్పు.. తెలియకపోతే మౌనంగా ఉండొచ్చు’ అని అన్నారు. ఆ తర్వాత ఆయన అడిగిన ప్రశ్న..
ఈ ప్రశ్న విన్న కృష్ణ తేజ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే స్నేహితుడి సూచనతో ముందు రోజు రాత్రే ఆయనపై నోట్స్ తయారు చేసుకోవడంతో వెంటనే సమాధానం ఇచ్చారు. క్వాన్ యూ సింగపూర్ మాజీ ప్రధానమంత్రి అని, సింగపూర్ను అభివృద్ధి చేసి పేద దేశం నుంచి సంపన్న దేశంగా మార్చడంలో కీలక పాత్ర పోషించారని వివరించారు. పోర్టులు, పర్యాటకం, ఆర్థిక రంగం, స్టార్టప్లు వంటి అనేక రంగాలను అభివృద్ధి చేశారని చెప్పారు. అదే సమయంలో ఆయన పాలనలోని ప్రతికూల అంశాలను కూడా ప్రస్తావించారు. మీడియా స్వేచ్ఛ, ప్రజల స్వేచ్ఛపై ఆంక్షలు విధించారనే విమర్శలను వివరించారు. కృష్ణ తేజ సమాధానంతో సంతృప్తి చెందిన ప్యానెల్ సభ్యుడు ‘Very good, please go’ అంటూ ఇంటర్వ్యూ ముగించారు.
ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే కృష్ణ తేజ తన స్నేహితుడితో ఈ అనుభవాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత తల్లికి ఫోన్ చేసి.. ‘ఈసారి నేను సర్వీస్లో ఉంటాను. ఏ సర్వీస్ వస్తుందో తెలియదు కానీ.. ఈసారి మాత్రం సర్వీస్ వస్తుంది’ అని చెప్పారట. అయితే ఈ విషయం తండ్రికి, ఇతర కుటుంబ సభ్యులకు చెప్పొద్దని తల్లిని కోరారు. ఒకవేళ ఫలితం అనుకూలంగా రాకపోతే కుటుంబ సభ్యులు నిరాశ చెందుతారనే ఉద్దేశంతో అలా చెప్పినట్లు తెలిపారు. కృష్ణ తేజ ఇంటర్వ్యూ జూన్ 4న జరిగింది. జూలై 2న ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు వచ్చే ముందు రోజు ర్యాంక్పై ఉత్కంఠ నెలకొనడంతో స్నేహితుడితో కలిసి సినిమా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంతకుముందు ఇద్దరి మధ్య ఓ సరదా పందెం కూడా ఉండేది. కృష్ణ తేజకు 100లోపు ర్యాంక్ వస్తే తన బుల్లెట్ బైక్ను స్నేహితుడికి ఇస్తానని ఆయన చెప్పారట. ఫలితాల రోజు స్నేహితుడు ఫోన్ చేసి ‘నీ బండి నాకు ఇవ్వాలి’ అని చెప్పడంతో కృష్ణ తేజ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తనకు 66వ ర్యాంక్ వచ్చినట్లు స్నేహితుడు చెప్పాడు. మూడు సంవత్సరాల కష్టానికి ఫలితంగా వచ్చిన ఆ ర్యాంక్తో కృష్ణ తేజ ఎంతో సంతోషించారు. అయితే తనకంటే ఎక్కువగా తన తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించిన ఆనందమే తనను కదిలించిందని చెప్పారు. ‘నా తల్లిదండ్రుల ముఖంలో ఆనందం చూసినప్పుడు.. వారి కడుపున పుట్టినందుకు నేను ఇస్తున్న గొప్ప బహుమతి ఇదేనేమో అనిపించింది’ అని కృష్ణ తేజ భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.
కృష్ణ తేజ 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2015 జూలైలో 66వ ర్యాంక్ సాధించగా.. అదే ఏడాది సెప్టెంబరు 7న ఐఏఎస్గా తన ఎంపిక ఖరారైంది. అనంతరం రెండేళ్ల పాటు శిక్షణ పొందారు. ఆ తర్వాత ఒక సంవత్సరం సబ్ కలెక్టర్గా అలెప్పీలో పనిచేశారు. కృష్ణ తేజ అనుభవం చూస్తే UPSC ఇంటర్వ్యూలో ఏ ప్రశ్న ఎదురైనా భయపడకుండా.. ప్రశ్న వెనుక ఉన్న అంశాన్ని అర్థం చేసుకుని, సమతుల్యంగా సమాధానం ఇవ్వడం ఎంత ముఖ్యమో స్పష్టమవుతోంది. అలాగే ఒక అంశాన్ని సమగ్రంగా చదివి సొంతంగా నోట్స్ తయారు చేసుకోవడం కూడా ఇంటర్వ్యూలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ప్రయాణం చెబుతోంది.