UPSC IFS 2025 Top Rankers: యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. మొత్తం ఎంత మంది ఎంపికయ్యారంటే?
యూపీఎస్సీ IFS 2024 ఫలితాలు బుధవారం (మే 21) విడుదలయ్యాయి. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిక వెబ్సైట్లో ఎంపికై అభ్యర్థుల జాబితాను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం 150 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. తాజా ఫలితాల్లో వివిధ కేటగిరీల్లో..

హైదరాబాద్, మే 22: యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS 2024) ఫలితాలు బుధవారం (మే 21) విడుదలయ్యాయి. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిక వెబ్సైట్లో ఎంపికై అభ్యర్థుల జాబితాను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం 150 పోస్టుల భర్తీకి గతేడాది జూన్ 16న యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అనంతరం నవంబర్ 24 నుంచి డిసెంబర్ 1వరకు మెయిన్స్, ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకు పర్సనాలిటీ టెస్టులు నిర్వహించించింది. తాజా ఫలితాల్లో వివిధ కేటగిరీల్లో మొత్తంగా 143 మందిని ఎంపిక చేశారు. 40 మంది అభ్యర్థులు జనరల్ కేటగిరీ కింద ఎంపిక కాగా.. 19 మంది ఈడబ్ల్యూఎస్, 50 మంది ఓబీసీ, 23 మంది ఎస్సీ, 11 మంది ఎస్టీ కేటగిరీలో ఎంపికయ్యారు. అభ్యర్థులు మార్కులను మరో 15 రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ 2025 ఫలితాల్లో అదరగొట్టిన తెలుగోళ్లు..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) పరీక్షలో ఏకంగా 10 మందికిపైగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు టాప్ ర్యాంకులు దక్కించుకున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 10 నుంచి 15 మంది వరకు ఎంపికైనట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చాడ నిఖిల్రెడ్డి 11వ ర్యాంకు సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ ర్యాంకర్ నిఖిల్రెడ్డి కావడం విశేషం. ఆ తర్వాత యెదుగూరి ఐశ్వర్యారెడ్డి 13వ ర్యాంకు, జి.ప్రశాంత్ 25వ ర్యాంకు, చెరుకు అవినాశ్రెడ్డి 40వ ర్యాంకు, చింతకాయల లవకుమార్ 49వ ర్యాంకు, అట్ల తరుణ్తేజ 53వ ర్యాంకు, ఆలపాటి గోపినాథ్ 55వ ర్యాంకు, కె.ఉదయకుమార్ 77వ ర్యాంకు, టీఎస్ శిశిర 87వ ర్యాంకు సాధించారు.
అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే..
మిర్యాలగూడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు చాడ శ్రీనివాస్రెడ్డి, సునంద దంపతుల కుమారుడు నిఖిల్రెడ్డి. ఢిల్లీ ఐఐటీలో 2018లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిఖిల్ రెడ్డి.. ఏడాదిన్నరపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. సివిల్స్ సాధించటమే లక్ష్యంగా చిన్నతనం నుంచి అమ్మానాన్నలు తనను అన్ని విధాలుగా ప్రోత్సహించారని నిఖిల్రెడ్డి మీడియాకు చెప్పారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




