
హైదరాబాద్, మే 1: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్లో ఫెయిలైన వారితోపాటు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాయగోరే విద్యార్ధులు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుంది. అయితే సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇంటర్ బోర్డు ఏప్రిల్ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. నిన్నటి దరఖాస్తు గడువు ముగియగా.. మే 1వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటన జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు ఈ రోజు తుది గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు అధికారులు సూచించారు. ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు ఇంటర్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులు ఆయా సబ్జెక్టులకు ఫీజు చెల్లించి సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
కాగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగుతాయి. జనరల్, ఒకేషనల్ కోర్సులకు ఒకేసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 9న ఇంటర్ ఫస్టియర్, జూన్ 10న సెకండియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. మరో వైపు ఇంటర్ జవాబుపత్రాల పునఃలెక్కింపు, పునఃమూల్యాంకనం కోసం దరఖాస్తు గడువు ఏప్రిల్ 30తో ముగిసింది.
జూన్ 11న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. జూన్ 12న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష నిర్వహిస్తారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 30 చివరి తేదీగా పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.