AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 3 Exam Day Guidelines: టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్ష రాసేవారికి కీలక ఆప్‌డేట్.. ఈ తప్పులు చేశారో డీబార్‌ ఖాయం

మరో పది రోజుల్లో గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 3 పేపర్లకు ఈ పరీక్షలు జరుగుతాయి. నవంబర్ 10వ తేదీ నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తారు. ఈ క్రమంలో TGPSC పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆఖరి నిమిషంలో ఈ తప్పులు చేస్తే చిక్కులు పడతారని సూచించింది.. అవేంటో తెలుసుకుందాం..

TGPSC Group 3 Exam Day Guidelines: టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్ష రాసేవారికి కీలక ఆప్‌డేట్.. ఈ తప్పులు చేశారో డీబార్‌ ఖాయం
TGPSC Group 3 Exam Day Guidelines
Srilakshmi C
|

Updated on: Nov 07, 2024 | 8:57 AM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 7: తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. మరో పది రోజుల్లో గ్రూప్‌ 3 పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) తాజాగా విడుదల చేసింది కూడా. ఈ షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 17, 18 తేదీల్లో ఈ పరీక్ష జరగనుంది. రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనుంది. నవంబర్‌ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 1 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరుగుతుంది. అలాగే, నవంబర్‌ 18న పేపర్‌ 3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇలా మొత్తం 3 పేపర్లకు గ్రూప్‌ 3 పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు నవంబర్‌ 10న అందుబాటులోకి రానున్నాయి. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షలకుపైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 అభ్యర్ధులకు ముఖ్య సూచనలు

  • గ్రూప్-3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. పేపర్‌ 1లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌, పేపర్‌ 2లో హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ అంశాలు, పేపర్‌ 3లో ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ వంటి విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ.. మూడు భాషల్లో నిర్వహిస్తారు.
  • గ్రూప్‌ 3 పరీక్షలు ఆఫ్‌లైన్‌ విధానంలో ఉంటాయి. కాబట్టి అభ్యర్ధులు బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌, హాల్‌టికెట్‌తోపాటు.. పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు వంటి తదితర ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్‌ గుర్తింపు కార్డును తమతోపాటు తీసుకెళ్లాలి.
  • హాల్‌టికెట్లను ఏ4 సైజు పేజీపై మాత్రమే ప్రింటు తీసుకోవాలి. ఒకవేళ అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్‌ ప్రింట్‌ కాకుంటే పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు తమతోపాటు మూడు పాస్‌పోర్టు ఫొటోలపై గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ తీసుకుని, పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు హామీపత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
  • మొదటి సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు.
  • అభ్యర్థులు మొదటి పరీక్షకు తీసుకెళ్లిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకూ తీసుకెళ్లాలి. పరీక్షల ఆనంతరం హాల్‌టికెట్‌ కాపీని, ప్రశ్నాపత్రాలను భద్రంగా పెట్టుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. డూప్లికేట్‌ హాల్‌టికెట్లను తర్వాత జారీ చేయబోమని స్పష్టం చేసింది.
  • పరీక్ష సమయంలో ప్రశ్నపత్రం ఓపెన్‌ చేయగానే అందులో అన్ని ప్రశ్నలు ముద్రించారా? లేదా? అనే విషయాన్ని చెక్‌ చూసుకోవాలి. తప్పుడు గుర్తింపు పత్రాలతో హాజరైనా, ఒకరి పేరిట మరొక అభ్యర్థి పరీక్ష రాసేందుకు వచ్చినా క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, డిబార్‌ చేస్తామని కమిషన్‌ హెచ్చరించింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.