
హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TSPCB)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 10 నుంచి ఆన్లైన్లో ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సివిల్, మెకానికల్, కెమికల్, బయోటెక్నాలజీ, మైనింగ్ లేదా ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. అలాగే ఏఎంఐఈ (ఇండియా) సివిల్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా ఇంజినీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్లో పీజీ చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అర్హులుగా పేర్కొన్నారు.
అభ్యర్థుల వయసు 2026 జులై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో మాత్రమే ఉంటుంది. రాత పరీక్ష సీబీఆర్టీ (ఆన్లైన్) లేదా ఓఎంఆర్ (ఆఫ్లైన్) ఆధారంగా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు జీతంగా అందించనున్నారు. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. దీనితోపాటు పరీక్ష ఫీజు రూ.120 అదనంగా చెల్లించాలి. నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.
దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ విధానంలో స్వీకరిస్తారు. కొత్త అభ్యర్థులు ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసి, అనంతరం అవసరమైన వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తుల గడువు జులై 17, 2026తో ముగుస్తుంది. రాత పరీక్ష సెప్టెంబర్ 2026లో నిర్వహించే అవకాశం ఉందని కమిషన్ వెల్లడించింది.
రాత పరీక్ష రెండు పేపర్లకు మొత్తం 450 మార్కులకు నిర్వహించబడుతుంది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కు 150 మార్కులు, సివిల్ ఇంజినీరింగ్ (డిగ్రీ స్థాయి)కు 300 మార్కులు కేటాయించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం, బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి.