
హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ తాజాగా విడుదలైంది. జనవరి 2 నుంచి 20 వరకు జరిగిన ఆన్లైన్ టెట్ పరీక్షలు మొత్తం 10 రోజుల పాటు 20 సెషన్లలో నిర్వహించిన సంగతి తెలిసిందే. టెట్కు 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో పేపర్ 1కు 94,327 మంది, పేపర్ 2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,05,278 మంది అంటే 74.44 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. తాజాగా టెట్ ప్రాథమిక ‘కీ’తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం నిపుణుల కమిటీ తుది ఆన్సర్ కీ రూపొందిస్తుంది. ఆ వెనువెంటనే ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.
తెలంగాణ టెట్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి నెల 5వ తేదీన విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. రేవంత్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత యేటా రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని, ఏటా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత ఏడాది అధికారం చేపట్టిన నాటి నుంచి వరుసగా రెండు సార్లు టెట్తోపాటు డీఎస్సీ కూడా నిర్వహించింది. ఈ మేరకు గత ఆగస్టులోనే 2024-25 సంవత్సరానికి ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసింది. జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్లుగానే 2024లో రెండో టెట్ జరిపింది. ఇక డీఎస్సీ నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరిలో విడుదల చేస్తామని, ఏప్రిల్లో పరీక్ష జరుపుతామని జాబ్ క్యాలెండర్లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎస్సీ వర్గీకరణ అంశం ఆలోపు తేలితే ప్రటకన వెలువడే అవకాశం ఉంది. వర్గీకరణ పూర్తికాకుంటే ఎప్పటికి డీఎస్సీ ప్రకటన వస్తుందో స్పష్టంగా తెలియడం లేదు.
మరోవైపు ఎస్సీ వర్గీకరణ అంశం తేలే వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమేనని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే డీఎస్సీలో సుమారు 6 వేల పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే పలుమార్లు ఆయా ప్రభుత్వం వర్గాలు ప్రకటించించిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.