
హైదరాబాద్, మే 16: తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4,12,724 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వారిలో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 2,49,032 మందిచ ఒకేషనల్ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. ఇక ఇంటర్ సెకండియర్లో జనరల్ పరీక్షలకు 1,34,341 మంది, ఒకేషనల్ విద్యార్థులు 12,357 మంది విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించారు. నిజానికి, ఏప్రిల్ 22న విడుదలైన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో తొలి ఏడాదిలో తప్పిన విద్యార్థుల సంఖ్య 1.91 లక్షల మంది మాత్రమే అయినా.. వీరిలో మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ రాసేవారు అధిక సంఖ్యలో ఉండటంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్ధుల సంఖ్య అమాంతం పెరిగింది.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఇప్పటికే సబ్జెక్టుల వారీగా తేదీలతో సహా పూర్తి షెడ్యూల్లు జారీ చేసింది. ఇంటర్ సప్లిమెంటరీ హాల్టికెట్లు మరో రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. విద్యార్ధులు అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన 10 నుంచి 15 రోజుల్లోనే ఇంటర్ బోర్డు ఫలితాలను కూడా జారీ చేయనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.