
హైదరాబాద్, మే 4: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 124 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అందులో 28 కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం (ఏఈడీపీ) పేరిట కొత్త కోర్సులను విద్యాశాఖ ప్రవేశపెట్టనుంది. ఇందులో బీకాం (బీఎఫ్ఎస్ఐ), ఈ-కామర్స్ ఆపరేషన్స్, రిటైల్ ఆపరేషన్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆపరేషన్స్, బీఎస్సీ ఇన్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ, బీబీఏ ఇన్ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్, బీఎస్సీ డిజిటల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ మార్కెటింగ్ అండ్ సేల్స్ కోర్సులు ఉన్నాయి.
వీటన్నింటినీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కళాశాల విద్య కమిషనరేట్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. విద్యార్ధులకు నైపుణ్యాలు నేర్పి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సమృద్ధిగా పెంపొందించడమే లక్ష్యంగా ఈ కోర్సులను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2018లో 28,035 మంది డిగ్రీ కోర్సుల్లో చేరగా… 2024-25 విద్యా సంవత్సరానికి ఆ సంఖ్య 50,477 మందికి పెరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ రానుంది. ఈ మేరకు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి క్రీడల అభివృద్ధికి జిల్లాల వారీగా ప్రత్యేక అకాడమీలు ఏర్పాట్లు చేస్తామని ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్బాబు తెలిపారు. అటు చదువుతో పాటు ప్రతిఒక్కరూ క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలని మంత్రి సూచించారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన సలహాదారుగా నియమితులైన కొసరాజు లక్ష్మణ్, మీడియా కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డిలకు ఆయన శనివారం (మే 3) నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మీడియాకు తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.