
హైదరాబాద్, మే 17: తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (టీజీ ఈఏపీసెట్) 2026 ఫలితాలు ఆదివారం (మే 17) ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చేతుల మీదగా ఫలితాలు వెల్లడించారు. ఈఏపీసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది టీవీ9 తెలుగు అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా ఫలితాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తాజా ఫలితాల్లో భారీగా ఉత్తీర్ణత శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. టీజీ ఈఏపీసెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో 93.58 శాతం, అగ్రికల్చర్ విభాగంలో 93.38 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కాగా జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరగగా, మే 9 నుండి 11 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,10,766 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 1,97,241 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, 84,954 మంది అగ్రికల్చర్ విద్యార్ధులు పరీక్షలు రాశారు. అంటే దాదాపు 93 శాతం మంది పరీక్షలు రాశారన్నమాట. ఈసారి పరీక్ష ముగియగానే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్పై మార్కులు ప్రత్యక్షమయ్యేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక పరీక్షలు ముగిసిన కేవలం 6 రోజుల వ్యవధిలోనే ఉన్నత విద్యామండలి ఈఏపీసెట్ ఫలితాలు వెల్లడించడం గమనార్హం.
టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పరీక్షలు ముగిసిన వెంటనే విడుదల చేసిన ప్రాథమిక ఆన్సర్ కీపై అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ప్రశ్న లు, సమాధానాలపై ఒక్క అభ్యంతరం రాకపోవడం గమనార్హం. ఇక ఆరు సెషన్లలో నిర్వహించిన ఇంజినీరింగ్ విభాగం పరీక్షకు మాత్రం 16 అభ్యంతరాలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ నిపుణుల కమిటీ తొలిపుచ్చింది. దీంతో ఫలితాల ప్రక్రియ వేగం పుంజుకుంది. శుక్రవారం నిర్వహించిన సెట్ కమిటీ సమావేశంలో ఈఏపీసెట్ ఫైనల్ కీని ఖరారు చేసిన ఉన్నత విద్యా మండలి.. ఈ మేరకు ఫలితాలను వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.