SSC Public Exams 2025: రేపట్నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!

|

Mar 20, 2025 | 8:38 AM

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభంకానుండగా.. 9:35 వరకు విద్యార్ధులను అనుమతిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఆ తర్వాత వచ్చే విద్యార్థులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని..

SSC Public Exams 2025: రేపట్నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!
SSC Public Exams
Follow us on

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రేపట్నుంచి (మార్చి 21) ప్రారంభంకానున్నాయి. మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్‌ 4 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల మాదిరి పదో తరగతి పరీక్షలకు కూడా ఐదు నిమిషాలు గ్రేస్‌ టైం ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అంటే ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభంకానుండగా.. 9:35 వరకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తామని, ఆ తర్వాత వచ్చే విద్యార్థులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. ఇప్పటికే హాల్‌టికెట్లు విడుదల చేశామని, విద్యార్ధులు వెబ్‌సైట్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,650 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 5, 09,403 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోతున్నట్టు తెలిపారు. కాంపోజిట్‌ పేపర్లకు పరీక్షరాసేవారికి మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామరి తెలిపారు.

విద్యార్ధులకు ముఖ్య సూచనలు..

  • ఈ ఏడాది తొలిసారిగా పదో తరగతి విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను ఇస్తున్నారు. విద్యార్థులు ఆ బుక్‌లెట్‌లోని పేజీల్లోనే ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. అడిషనల్‌ కావాలంటే కూడా ఇస్తారు.
  • పేపర్లు లీకేజీని అరికట్టేందుకు ప్రశ్నపత్రాలపై మొదటి సారిగా క్యూఆర్‌ కోడ్‌ను ముద్రిస్తున్నారు.
  • అలాగే తొలిసారిగా ఒక్కో పేపర్‌పై ఒక యూనిక్‌ నంబర్‌ను సైతం ముద్రిస్తున్నారు. ఈ యూనిక్‌ నంబర్‌ ప్రశ్నపత్రంలోని అన్ని పేజీలపై ఉంటుందన్నమాట.
  • ఇక సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పేపర్లకు పరీక్షలను వేర్వేరుగా రెండు రోజుల్లో నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలను ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకే పరీక్ష జరుగుతుంది.
  • గణితం పరీక్ష రోజున గ్రాఫ్‌ పేపర్‌ విడిగా ఇస్తారు.
  • సీఎస్‌డీవో గదుల్లో సీసీ కెమెరాల నిఘాలోనే ప్రశ్నపత్రాల బండిట్స్‌ తెరుస్తారు.

పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు, సందేహాలుంటే 040-23230942 అనే ఫోన్‌ నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని, అందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.