హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రేపట్నుంచి (మార్చి 21) ప్రారంభంకానున్నాయి. మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల మాదిరి పదో తరగతి పరీక్షలకు కూడా ఐదు నిమిషాలు గ్రేస్ టైం ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అంటే ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభంకానుండగా.. 9:35 వరకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తామని, ఆ తర్వాత వచ్చే విద్యార్థులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఇప్పటికే హాల్టికెట్లు విడుదల చేశామని, విద్యార్ధులు వెబ్సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,650 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 5, 09,403 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోతున్నట్టు తెలిపారు. కాంపోజిట్ పేపర్లకు పరీక్షరాసేవారికి మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామరి తెలిపారు.
పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు, సందేహాలుంటే 040-23230942 అనే ఫోన్ నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని, అందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.