
హైదరాబాద్, జూన్ 22: దేశ వ్యాప్తంగా ఆదివారం నీట్ 2026 రీ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ విధానంలో (పెన్ను, పేపర్) ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 20 లక్షలకు పైగా విద్యార్దులు హాజరయ్యారు. అయితే అనేక చోట్ల హాజరుశాతం కాస్త తగ్గింది. అయితే అన్ని ప్రభుత్వ విభాగాల సహకారంతో నీట్ పునఃపరీక్షను కేవలం 37 రోజుల్లోనే దిగ్విజయంగా నిర్వహించారు. అయితే పరీక్ష నిర్వహణ సమయంలో పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్ధులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ పట్టుబడ్డారు.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాగన్నగూడలోని జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో ఓ అభ్యర్ధి మాల్ప్రాక్టీస్ చేస్తూ దొరికిపోయాడు. అచ్చంపేటకు చెందిన జండావత్ నరేందర్ జూన్ 21 (ఆదివారం) అనే అభ్యర్ధి నీట్కు హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభం కాగానే ఇన్విజిలేటర్లు ప్రశ్నపత్రాలు అభ్యర్ధులకు అందించారు. ప్రశ్నాపత్రం ఇచ్చిన తర్వాత కొద్దిసేపు గదిలోనే ఉన్న నరేందర్ ఆ తర్వాత టాయ్లెట్కి వెళ్లాడు. అయితే అతడు 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం టాయ్లెట్లోనే ఉండటం, అతడు తిరిగి రాకపోవడంతో ఇన్విజిలేటర్కు అనుమానం వచ్చింది.
వెంటనే అతడు ఇతర అధికారులతో కలిసి టాయిలెట్కు వెళ్లి తనిఖీ చేశాడు. అక్కడ నరేందర్ సెల్ఫోన్ వినియోగిస్తూ కనిపించాడు. నరేందర్ తన చేతిలోని ఫోన్ గూగుల్లో సమాధానాల కోసం వెతుకుతున్నట్లు అధికారులు గుర్తించి.. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆదిభట్ల పోలీసులకు అప్పగించి మాల్ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు. పరీక్ష రోజున అంటే ఆదివారం ఉదయం 7 గంటలకే పరీక్ష కేంద్రానికి వెళ్లి.. అక్కడ బాత్రూమ్లోని ఫ్లష్ట్యాంకులో సెల్ ఫోన్ దాచిపెట్టినట్లు ఆ విద్యార్థి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
యానాంకు చెందిన శ్యామల అనే విద్యార్ధిని కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్లో నీట్ పరీక్ష రాసేందుకు వచ్చింది. అయితే విద్యార్ధినికి ముక్కుపుడక ఉండటంతో పరీక్ష నిర్వాహకులు పరీక్ష గదిలోకి అనుమతించలేదు. చిన్నతనంలో పెట్టిన ముక్కుపుడక కావడంతో అది తీయడానికి వీలుకాలేదు. దీంతో ఆమె తండ్రి నాగేశ్వరరావు అతికష్టం మీద కత్తెరతో దానిని కత్తిరించాల్సి వచ్చింది. ముక్కుపడక తొలగించడంతో ఆ విద్యార్థినిని అనుమతించారు. దీంతో విద్యార్ధిని పరీక్ష ప్రశాంతంగా రాసింది. కాగా రాష్ట్రంలో 89.09 శాతం అభ్యర్థులు నీట్ పరీక్షకు హాజరయ్యరు.