
దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో.. వివిధ విభాగాల్లో భారీగా కొలువుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,242 వరకు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్ధులు జూన్ 30వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సికింద్రాబాద్ సహా అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు ఐటీఐ, బీఎస్సీ, డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జులై 29, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు రూ.19,900 వరకు జీతంగా చెల్లిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. రీజియన్ల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, రాత పరీక్ష విధానం, సిలబస్, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఫీజు వంటి ఇతర పూర్తి వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్ జూన్ 30న విడుదల చేస్తారు.
ఆర్ఆర్బీ రైల్వేలో టెక్నీషియన్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.