హైదరాబాద్, మార్చి 14: ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ అయిన ఎక్సెల్ సివిల్స్ అకాడమీ.. యూపీఎస్సీ మెరిట్ స్కాలర్షిప్ 2025 పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ఎక్సెల్ సివిల్స్ అకాడమీ డైరెక్టర్ కె రాజేంద్ర కుమార్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. విద్యార్ధులకు ఈ పరీక్ష మార్చి 23న హైదరాబాద్, విజయవాడలోని పరీక్షా కేంద్రాల్లో ఆఫ్లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
విద్యార్ధులకు 23వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాత పరీక్ష నిర్వహిస్తారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోని ఎక్సెల్ సివిల్స్ అకాడమీ కేంద్రం, విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కేంద్రంలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు కోర్సు ఫీజులో 75 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.
ఇంటర్, డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎవరైనా ఈ పరీక్ష రాయొచ్చు. ఈ అర్హతలున్న విద్యార్ధులు మార్చి 20, 2025వ తేదీలోపు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే.. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టర్ కె రాజేంద్ర కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలకు 9100433442, 9100433445 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని అభ్యర్ధులకు సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.