AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఇక పదో తరగతి, ఇంటర్‌లో ‘ఫెయిల్’ ఉండదు!

10, 12వ తరగతి బోర్డు పరీక్షల మార్క్‌షీట్లపై ఇకపై ‘ఫెయిల్’ అనే పదాన్ని ముద్రించకూడదని విద్యాశాఖ నిర్ణయించింది. దాని స్థానంలో ‘కౌశల్ కే లియే పాత్ర’ (నైపుణ్యాల కోసం అర్హుడు) అనే పదాన్ని ఉపయోగించనున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని కాపాడటమే ఈ నిర్ణయం లక్ష్యమని విద్యాశాఖ మంత్రి తెలిపారు..

విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఇక పదో తరగతి, ఇంటర్‌లో ‘ఫెయిల్’ ఉండదు!
Bihar Decides To Drop Fail From Class 10, 12 Marksheets
Srilakshmi C
|

Updated on: Aug 30, 2026 | 3:12 PM

Share

పట్నా, ఆగస్ట్‌ 30: ఈ ఏడాది10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు బీహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల మార్క్‌షీట్లపై ‘Fail’ (ఫెయిల్) అనే పదాన్ని ముద్రించకూడదని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. దాని స్థానంలో ‘Kaushal ke liye patra’ (నైపుణ్యాల కోసం అర్హుడు) అనే పదాన్ని ఉపయోగించనున్నారు. ఈ ప్రతిపాదనను బీహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ గురువారం రాత్రి జరిగిన సమీక్షా సమావేశంలో ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా నిబంధనల్లో మార్పులు చేయడంతో పాటు, అవసరమైన మార్గదర్శకాలను బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (BSEB) జారీ చేయనుంది. పరీక్షల్లో ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేకపోవడం విద్యార్థి ప్రతిభకు అద్దంపట్టదని మంత్రి మిథిలేష్ తివారీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకే సర్టిఫికెట్లపై ‘ఫెయిల్’ వంటి పదాలను ఉపయోగించకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

శనివారం ‘నో బ్యాగ్ డే’

మ్యాట్రిక్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ తరగతులు సుమారు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. విద్యార్థులకు అదనపు ప్రిపరేషన్ అందించడం, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలను పెంచడం ఈ ప్రత్యేక తరగతుల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. బీహార్‌లో పాఠశాల విద్యా విధానంలో ఇప్పటికే పలు మార్పులను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’గా అమలు చేస్తున్నారు. ఆగస్టు 6న ప్రకటించిన కొత్త విధానం ప్రకారం.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. శనివారం మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహిస్తారు. 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్నం వరకు విద్యా, ఇతర కార్యక్రమాలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.40 గంటల వరకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. ఆ తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపిస్తారు. సెకండరీ, హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో బోధన, ఇతర షెడ్యూల్ కార్యక్రమాలు మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతాయి.

‘నో బ్యాగ్ డే’లో భాగంగా విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నాటకం, సంగీతం, ఇతర సృజనాత్మక కార్యక్రమాలను పరిచయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కళలు, సంగీతంలో నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులను నియమించనున్నారు. తరగతులు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయులు మరో గంటపాటు వివిధ విద్యా సంబంధిత పనుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పాఠాల ప్రణాళిక తయారు చేయడం, విద్యార్థుల పనితీరును అంచనా వేయడం, టీచర్ డైరీలను నవీకరించడం, హోంవర్క్ పరిశీలించడం, ల్యాబొరేటరీ నిర్వహణ, అవసరమైన విద్యార్థులకు రెమెడియల్ క్లాసులు నిర్వహించడం వంటి పనులు ఇందులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మహిళల కోసం ప్రత్యేక యూనివర్సిటీ

మరోవైపు గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి మరో కీలక ప్రకటన చేశారు. బీహార్‌లో మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయంలో వైస్‌చాన్స్‌లర్, ప్రొఫెసర్లు మొదలుకొని ఇతర సిబ్బంది వరకు అన్ని స్థాయిల్లో మహిళలే ఉండేలా చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు కూడా మహిళలే ఉంటారని సీఎం వెల్లడించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, పరీక్షల్లో వైఫల్యాన్ని ప్రతికూల ముద్రగా చూడకుండా నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సహించడం లక్ష్యంగా బీహార్ ప్రభుత్వం విద్యా రంగంలో ఈ మార్పులను తీసుకొస్తోంది.

Follow Us