MBBS Admissions: తెలంగాణలో ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యం.. విద్యార్ధుల్లో గందరగోళం!

|

Sep 08, 2024 | 3:02 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ ప్రక్రియ నానాటికీ ఆలస్యమవుతుంది. స్థానికత వివాదంపై హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌పై వైద్యారోగ్య శాఖ సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వం స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించిన తర్వాతే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే ఆల్‌ ఇండియా స్థాయిలో ఇప్పటికే తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తైన సంగతి తెలిసిందే. రెండో విడతకు త్వరలో నోటిఫికేషన్‌..

MBBS Admissions: తెలంగాణలో ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యం.. విద్యార్ధుల్లో గందరగోళం!
MBBS Admissions
Follow us on

హైదరాబాద్‌, సెప్టెంబర్ 8: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ ప్రక్రియ నానాటికీ ఆలస్యమవుతుంది. స్థానికత వివాదంపై హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌పై వైద్యారోగ్య శాఖ సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వం స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించిన తర్వాతే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే ఆల్‌ ఇండియా స్థాయిలో ఇప్పటికే తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తైన సంగతి తెలిసిందే. రెండో విడతకు త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ తొలి విడతకు రెండు రోజుల క్రితం నోటిఫికేషన్‌ వచ్చేసింది. ఈ రోజుతో (సెప్టెంబర్ 8వ తేదీ) వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ముగుస్తుంది. 10వ తేదీతో తొలివిడత సీట్ల భర్తీ ప్రక్రియ కూడా ముగుస్తుంది. అయితే తెలంగాణలో మాత్రం ఎక్కడి గొంగళి అక్కడేనన్న చందంగా ప్రవేశాల ప్రక్రియ ముందుకు సాగలేదు. అసలెప్పుడు మొదలవుతుందో కూడా స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే కన్వీనర్, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఎంబీబీఎస్‌ సీట్ల కోసం 24,122 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇంతలో స్థానికత సమస్యపై హైకోర్టులో పిటిషన్లు దాఖలవడంతో.. కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ ప్రక్రియను నిలిపివేసింది.

తాజాగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. ప్రభుత్వం స్థానికతను నిర్ధారించేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించే పనిలో పడింది. ఇది పూర్తైతేగానీ ప్రవేశాలు ప్రక్రియ ప్రారంభంకాదు. దీంతో రాష్ట్రంలో సీటు రాకుంటే ఇతర రాష్ట్రాల్లో చేరాలనుకునే విద్యార్థుల్లో గుబులు నెలకొంది. గతేడాది సెప్టెంబరు 9 నాటికి రెండో విడత కౌన్సెలింగ్‌ కూడా ముగిసింది. ఇక అక్టోబరు 1 నుంచి దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించకుంటే ఎంబీబీఎస్, పీజీ సహా ఇతర కోర్సులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

యూజీసీ- నెట్‌ 2024 ప్రిలిమినరీ కీ విడుదల.. త్వరలో ఫలితాలు

యూజీసీ- నెట్‌ 2024 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 21, 22, 23వ తేదీల్లో ఈ పరీక్షలు జరిగాయి. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 9వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేసేందుకు అవకాశం ఇచ్చింది. అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ఫైనల్‌ కీతోపాటు త్వరలో ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవి కూడా చదవండి

యూజీసీ నెట్ 2024 ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.