
కోటా, అక్టోబర్ 6: కోచింగ్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజస్థాన్లోని కోటాకు యేటా లక్షలాది విద్యార్ధులు వస్తుంటారు. అయితే అక్కడ వివిధ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్న వందలాది విద్యార్ధులు ఇప్పటికే ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో అక్కడికి వచ్చే విద్యార్థుల రక్షణ, కౌన్సెలింగ్, మెంటార్షిప్ కోసం కోటా నగర పోలీసులు ఓ ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించారు. ‘కె-ఎస్వోఎస్’ అనే ఈ యాప్ 2024లో అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ఒక్క క్లిక్తో సేవలందిస్తుంది. గత విద్యార్థుల అనుభవాలు, వారి గైడెన్స్ వంటి ఫీచర్లనూ ఇందులో జత చేసినట్లు కోటా ఎస్పీ తేజస్వీ గౌతమ్ తెలిపారు.
ఇప్పటికే 70 వేల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ యాప్లో విద్యార్థి లొకేషన్ను కూడా చిటికెటలో గుర్తించవచ్చు. స్థానిక గార్డియన్ నంబరు, కోచింగ్ సంస్థ, హాస్టల్, అత్యవసర నంబర్లు ఇందులో ఉంటాయి. ఈ K-SOS అప్లికేషన్లో పానిక్ బటన్ను ఒక్కసారి నొక్కితే, విద్యార్థి లొకేషన్, మొబైల్ నంబర్ గురించి సమాచారం పోలీసు కంట్రోల్ రూమ్కు అందుతుంది. ఆ తర్వాత బాధితుడి సమాచారాన్ని సంఘటన స్థలానికి సమీపంలోని సమీప పోలీసు బృందంతో పంచుకోవడం ద్వారా సమస్య త్వరగా పరిష్కరించబడుతుంది.
కోచింగ్ విద్యార్థుల భద్రత కోసం, వారి సమాచారం అంతా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని ఎస్పీ తేజస్వీ గౌతమ్ వెల్లడించారు. అప్లికేషన్లోని స్టాప్ బటన్ను నొక్కిన తర్వాత, విద్యార్థి వివరాలు అప్లికేషన్ నుంచి స్వయంచాలకంగా తీసివేయబడతాయని వివరించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.