
అమరావతి, మార్చి 9: దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు గురువారం (ఏప్రిల్ 2) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 2, 4 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను మాత్రమే ఎన్టీఏ జారీ చేసింది. మిగతా పరీక్షల అడ్మిట్ కార్డులను తాజాగా ఎన్టీయే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీల్లో పరీక్షలు జరిగే అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ నంబర్ అధికారిక వెబ్సైట్లో ఎంటర్ చేసి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డుపై క్యూఆర్ కోడ్, బార్ కోడ్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ అవి సరిగ్గా ప్రింట్ రాకపోతే మరోమారు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
కాగా షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ సెషన్ 2 ఆన్లైన్ పరీక్షలు (పేపర్ 1, పేపర్ 2) ఏప్రిల్ 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా 304 నగరాలు, విదేశాల్లో 14 నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జేఈఈ తుది సెషన్లో దాదాపు 11.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. పరీక్షలు ఏప్రిల్ 6వ తేదీ వరకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఇక చివరి రోజున మాత్రం అంటే ఏప్రిల్ 8న రెండో షిఫ్టులో పేపర్1 పరీక్ష జరగనుంది. అలాగే ఏప్రిల్ 7న పేపర్ 2ఎ (బీఆర్క్), పేపర్ 2బి (బీప్లానింగ్) పరీక్షలు నిర్వహిస్తారు.
ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను పరీక్షకు మూడు రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 011-40759000 నంబర్ను సంప్రదించవచ్చు లేదా jeemain@nta.nic.inకి ఈమెయిల్ ద్వారా తెలియజేయవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.