JEE Main 2026 Results: ఇవాళే జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు.. మీ స్కోర్ కార్డ్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కాబోతున్నాయి. ఈ ఏడాది పేపర్ క్లిష్టత పెరిగిందని టాక్ వినిపిస్తుండటంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంమీ స్కోర్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫలితాల తర్వాత మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటీ..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంజనీరింగ్ విద్యార్థుల నిరీక్షణకు ఇవాళ తెరపడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం JEE మెయిన్ 2026 సెషన్-1 ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. జనవరి 21 నుండి జనవరి 29 వరకు జరిగిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షా ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను, స్కోర్ కార్డ్లను నేరుగా అధికారిక వెబ్సైట్ల నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. jeemain.nta.nic.in, nta.ac.in వెబ్సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.
డౌన్లోడ్ ప్రక్రియ
- వెబ్సైట్ను సందర్శించి JEE Main 2026 Session 1 Scorecard లింక్పై క్లిక్ చేయండి.
- మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
- మీ హాల్ టికెట్లో ఉన్న విధంగా వివరాలు సరిచూసుకుని సబ్మిట్ నొక్కండి.
- స్కోర్ కార్డ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ తీసుకోండి.
ఈ ఏడాది పరీక్షా సరళి ఎలా ఉంది?
గత ఏడాదితో పోలిస్తే ఈసారి పేపర్లు మోస్తరు నుండి కష్టంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా జనవరి 21 నుండి 28 వరకు జరిగిన BTech/BE (పేపర్ 1) పరీక్షల్లో ప్రశ్నలు విద్యార్థుల కాన్సెప్చువల్ క్లారిటీని, సమయ నిర్వహణను పరీక్షించే విధంగా క్లిష్టంగా వచ్చాయి. ఫిబ్రవరి 4న విడుదలైన తాత్కాలిక కీపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది ఫలితాలను NTA ప్రకటించింది. మొత్తం 13లక్షలకుపైగా విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్లో జరిగే సెషన్-2 పరీక్షలు కూడా ముగిసిన తర్వాతే NTA తుది ర్యాంకులు, EE అడ్వాన్స్డ్ కట్-ఆఫ్ వివరాలను వెల్లడిస్తుంది.
కొనసాగుతున్న సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ
మరోవైపు జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే జోరుగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ ఆన్లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 25 వరకు గడువు ఉంది. సెషన్-1 రాసిన విద్యార్థులు సైతం తమ స్కోర్ను మెరుగుపరుచుకోవడానికి ఈ మలి విడత పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గతంలోనే రెండు సెషన్లకు కలిపి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసిన వారు మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం.. సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 9 వరకు ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. అభ్యర్థులు రాసిన రెండు సెషన్లలో దేనిలో ఉత్తమ స్కోర్ వస్తే దాన్నే తుది ర్యాంకు నిర్ణయానికి పరిగణనలోకి తీసుకుంటారు.
నెక్ట్స్ ఏంటీ?
- సెషన్-1 ముగిసిన వెంటనే విద్యార్థులు ఏప్రిల్ సెషన్కు సిద్ధం కావాల్సి ఉంటుంది.
- ఏప్రిల్ సెషన్ ముగిసిన తర్వాతే NTA ఫైనల్ ర్యాంకులు, JEE అడ్వాన్స్డ్ కోసం కట్ ఆఫ్ పర్సంటైల్ను ప్రకటిస్తుంది.
- విద్యార్థులు తమ పర్సంటైల్ ఆధారంగా అంచనా వేయడానికి ఆన్లైన్ ర్యాంక్ ప్రిడిక్టర్ టూల్స్ను ఉపయోగించవచ్చు.
