
హైదరాబాద్, జూన్ 2: దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు సోమవారం (జూన్ 2) విడుదలైన సంగతి తెలిసిందే. మే 18న ఈ పరీక్ష నిర్వహించగా.. ఈ రోజు ఉదయం ఫలితాలను ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 1.80 లక్షల మంది పరీక్ష జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసినట్లు సమాచారం. మొత్తం 360 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించారు. తాజా ఫలితాల్లో ఐఐటీ ఢిల్లీ జోన్ విద్యార్థి రజిత్ గుప్తా.. 332 మార్కులతో ఆలిండియా టాప్ ర్యాంకు సాధించాడు. ఐఐటీ ఖరగ్పూర్ జోన్ విద్యార్థి దేవదత్ మాజీ.. ఆలిండియా మహిళా టాపర్గా నిలిచారు. ఇద్దరు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు కూడా టాపర్లుగా నిలిచారు. ఈడబ్ల్యూఎస్ ఆలిండియా టాపర్గా వంగాల అజయ్రెడ్డి, ఓబీసీ ఎన్సీఎల్ ఆలిండియా టాపర్గా డీ జ్ఞాన రుత్విక్ సాయి నిలిచారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థి అర్నవ్ సింగ్ ఆలిండియా 9వ ర్యాంకు, వడ్లమూడి లోకేష్ ఆలిండియా 10వ ర్యాంకు, అనిరుద్రెడ్డి ఆలిండియా 20వ ర్యాంకు, కే రసజ్ఞ హైదరాబాద్ ఆలిండియా 78వ ర్యాంకును సొంతం చేసుకున్నారు.
కాగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు దేశ వ్యాప్తంగా 1.87లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1. 80 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 54,378 మంది క్వాలిఫై అయ్యారు. అర్హత సాధించిన వారిలో అబ్బాయిలు అధికంగా ఉన్నారు. 44వేల మంది అబ్బాయిలు క్వాలిఫై అయితే, అమ్మాయిలు కేవలం 9,404 మంది మాత్రమే అర్హత సాధించారు. తాజా ఫలితాల్లో హైదరాబాద్ జోన్ నుంచి అధికంగా 12,946 మంది విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలున్నాయి. మొత్తం 7 జోన్లు ఉండగా.. ఇందులో కేవలం హైదరాబాద్ జోన్ నుంచే టాప్ 500లో అత్యధికులు టాపర్లుగా నిలిచారు. టాప్ 10లో ఇద్దరు, టాప్ 100లో 23 మంది, టాప్ 200లో 57 మంది, టాప్ 300లో 78 మంది, టాప్ 400లో 116, టాప్ 500లో 136 ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులే ఉండటం విశేషం. కాగా ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీల్లో దాదాపు 17వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.