
హైదరాబాద్, ఫిబ్రవరి 22: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యువిక 2026 – యువ శాస్త్రవేత్తల కార్యక్రమం (యువ విజ్ఞాని కార్యక్రమ్) కోసం దేశవ్యాప్తంగా ఉన్న 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది. వైజ్ఞానిక శాస్త్రంతో పాటు అంతరిక్ష పరిజ్ఞానం, దాని అనువర్తనాలపై క్విజ్ రూపంలో పిల్లలను పరీక్షిస్తారు. ఇందుకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 31, 2026వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2026 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న భారతీయ విద్యార్థులు మాత్రమే యువికాకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (STEM)లో కెరీర్ను కొనసాగించాలనుకునే విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ పరీక్ష యేటా నిర్వహిస్తున్నారు. 8వ తరగతి వార్షిక పరీక్షలో పొందిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఉంటుంది.
ఆన్లైన్ క్విజ్లో పనితీరు 10 శాతంగా ఉంటుంది. గత మూడు సంవత్సరాలలో సైన్స్ ఫెయిర్లు, సహ-పాఠ్య కార్యకలాపాల్లో పాల్గొనడం స్థాయిని బట్టి 2 నుంచి 10 శాతం వెయిటేజీ ఉంటుంది. ఒలింపియాడ్లు, క్రీడా పోటీలలో సాధించిన విజయాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్, NCC లేదా NSSలో సభ్యత్వం కలిగిన వారికి కూడా అదనపు మార్కులు కేటాయిస్తారు. పంచాయతీ లేదా గ్రామీణ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 15 శాతం వెయిటేజీ లభిస్తుంది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి కనీస ప్రాతినిధ్యంకు ISRO అవకాశం ఇస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.