Inter Exams 2025: ఇంటర్‌ జువాలజీ ప్రశ్నాపత్రంలో మరో తప్పిదం.. ఒకే రోజు 19 మాల్ ప్రాక్టీస్ కేసులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పరీక్షలు ప్రారంభం నాటి నుంచి తరచూ ఇంటర్‌ ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లడం చర్చణీయాంశంగా మారింది. తాజాగా శనివారం జరిగిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం జువాలజీ ఇంగ్లిష్‌ మీడియం పరీక్ష ప్రశ్నాపత్రంలోనూ ఓ ప్రశ్నను అస్పష్టంగా ఇవ్వడంతో విద్యార్ధులు గందరగోళంలోపడ్డారు..

Inter Exams 2025: ఇంటర్‌ జువాలజీ ప్రశ్నాపత్రంలో మరో తప్పిదం.. ఒకే రోజు 19 మాల్ ప్రాక్టీస్ కేసులు
మాల్ ప్రాక్టీస్ లేదా ఇతరత్రా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రశ్న పత్రాలపై క్యూఆర్ కోడ్ తో పాటు సీరియల్ నెంబర్ను విద్యాశాఖ ముద్రించింది.

Updated on: Mar 16, 2025 | 4:40 PM

హైదరాబాద్‌, మార్చి 16: తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15న (శనివారం) జరిగిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం జువాలజీ ఇంగ్లిష్‌ మీడియం పరీక్ష ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాలి. ఈ పరీక్షలో 20వ ప్రశ్న తికమకగా ఇవ్వడంతో స్పష్టత కరువైంది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ పరీక్షలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏదైనా ఒకటి రాయాలని అడగాలి. దీనికి బదులు పటం సహాయంతో మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించండి అని ప్రశ్న ఇచ్చారు. దీంతో అసలు పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థల్లో దేని గురించి రాయాలో తెలియక విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.

విద్యార్ధులు పరీక్ష విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లను దీని గురించి అడిగితే తమకు ఇంటర్‌ బోర్డు నుంచి ఎలాంటి సమాచారం అందలేదనీ, తప్పును సరిదిద్దుకోవాలని అధికారులు తమకు ఎలాంటి సూచనలు చేయలేదనీ ఇన్విజిలేటర్లు సమాధానమిచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. దీంతో పరీక్ష పూర్తయ్యేంత వరకూ ఎలాంటి సూచనలు చేయకపోవడంతో విద్యార్ధులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్ష పూర్తయ్యాక అది 8 మార్కుల ప్రశ్న అని తాము నష్టపోతామని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎటెంప్ట్‌ చేసిన వారికి పూర్తి మార్కులు ఇవ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్‌ బోర్డును కోరుతున్నారు. కాగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రశ్నాపత్రాల్లో ఇదే మాదిరి వరుస తప్పులు దొర్లుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే శనివారం జరిగిన ఇంటర్మీడియెట్ సెకండియర్‌ పరీక్షలో భారీగా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. శనివారం మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరగ్గా.. ఏకంగా19 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనాయి. నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది మంది, సంగారెడ్డిలో నలుగురు, మేడ్చల్ లో ఇద్దరు, సిద్దిపేటలో ఇద్దరు, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరిపై కేసులు పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.