
సీబీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిట టెస్ట్ (CTET 2026 September) నోటిఫికేషన్ సోమవారం (మే 11) విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ఈ రోజు నుంచే అధికారిక వెబ్సైట్లో ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సీటెట్ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి ఫిబ్రవరి సెషన్ పరీక్షను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలో సీటెట్ సెప్టెంబర్ సెషన్కు 2026 రిజిస్ట్రేషన్లు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. దరఖాస్తు రుసుం కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్కు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు ఒక పేపర్కు రూ.500, రెండు పేపర్లకు రూ.600ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్ధులు జూన్ 10, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక సీటెట్ పరీక్షను సెప్టెంబర్ 6న (ఆదివారం) దేశ వ్యాప్తంగా మొత్తం 132 నగరాల్లో నిర్వహించనున్నారు. ఒకవేళ దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య భారీగా ఉంటే సెప్టెంబర్ 5న (శనివారం) కూడా ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పేపర్ 2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, పేపర్ 1 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు ఎగ్జామ్కు రెండు రోజుల ముందు మాత్రమే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు. ఫలితాలు మాత్రం అక్టోబర్ నెలాఖరు నాటికి ప్రకటించే అవకాశం ఉంది. కాగా సీటెట్ పరీక్షలో సాధించిన స్కోరుకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీని స్కోర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్లో సాధించిన స్కోర్కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.
సీటెట్ పరీక్ష మొత్తం రెండు పేపర్లు ఉంటుంది. పేపర్ 1 పరీక్షను ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించే వారికి, పేపర్ 2 పరీక్షను ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు బోధించాలనుకునే వారికి నిర్వహిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.