
హైదరాబాద్, మే 13: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) ఎట్టకేలకు 12వ తరగతి ఫలితాలను బుధవారం (మే 13) విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 85.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సీబీఎస్సీ వెల్లడించింది. గత ఏడాది (2025)తో 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం 3.19 శాతం తగ్గినట్లు తెలుస్తుంది. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను అధికారిక వెబ్సైట్లో నమోదు చేసి మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల 2026 డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా ఫలితాల్లో బోర్డు మెరిట్ జాబితాను విడుదల చేయలేదు. విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించడమే దీనికి కారణమని బోర్డు తన ప్రకటనలో తెలిపింది. సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులలో అగ్రస్థానంలో ఉన్న 0.1% మందికి బోర్డు మెరిట్ సర్టిఫికేట్ను జారీ చేస్తుంది. బాలికలు 88 శాతం, అబ్బాయిలు 82 శాతం చొప్పున ఉత్తీర్ణత శాతం నమోదైంది. 17వేల మంది విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోర్ చేశారు. గతంలో సీబీఎస్ 10, 12వ తరగతుల పరీక్షల ఫలితాలను ఏకకాలంలో విడుదల చేసేది. పదో తరగతిలో ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఈసారి పదో తరగతి ఫలితాలను కాస్త ముందుగానే ఏప్రిల్ నెలలో బోర్డు విడుదల చేసింది. ఈ రోజు 12వ తరగతి ఫలితాలను కూడా విడుదల చేశారు.
ఇక సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలు దేశంతోపాటు విదేశాలలో ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగాయి. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఒకే షిఫ్ట్లో జరిగాయి. మొత్తం 18 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్తోపాటు డిజిలాకర్, ఉమాంగ్ యాప్లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలను మే 13వ తేదీన విడుదల చేసింది. కాగా ఈ ఏడాది 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM)ను తొలిసారి బోర్డు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం 12వ తరగతి పరీక్షలకు బోర్డు డిజిటల్ మూల్యాంకన వ్యవస్థను పూర్తిస్థాయిలో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పటివరకు చేపట్టిన అతిపెద్ద ఆన్-స్క్రీన్ మార్కింగ్ కార్యక్రమంగా దీనిని అభివర్ణించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.