
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2024- 25 విద్యా సంవత్సరానికి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. ఈ మేరకు సీబీఎస్సీ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు తరగతులకు సంబంధించిన CBSE ప్రాక్టికల్ పరీక్షలు వచ్చే ఏడాది (2025) జనవరిలో ప్రారంభం కానున్నాయి. ఇక CBSE 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించిన థియరీ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
పదో తరగతి, 11వ తరగతికి సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు 2025, జనవరి 1 నుంచి, థియరీ పరీక్షలు 2025, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటనలో వెలువరించింది. ప్రాక్టికల్/ప్రాజెక్ట్/ఇంటర్నల్ అసెస్మెంట్కు సంబంధించి మార్కులను అప్లోడ్ చేసేటప్పుడు పాఠశాలలు కొన్నిసార్లు తప్పులు చేస్తున్నాయని, ఈ సారి ఈ విధమైన తప్పులు చోటు చేసుకోకుండా.. ఆయా పాఠశాలలకు ప్రాక్టికల్/ప్రాజెక్ట్/అంతర్గత మూల్యాంకనం, థియరీ పరీక్షలను సజావుగా నిర్వహించడంలో సహాయపడటానికి సబ్జెక్టుల జాబితా సమాచారం వివరాలను కూడా సర్క్యులర్కు జతచేసినట్లు బోర్డు వెల్లడించింది.
ఈ జాబితాలో ఇచ్చిన వివరాల ప్రకారం థియరీ, ప్రాక్టికల్, ప్రాజెక్ట్, IA భాగాల మధ్య మార్కుల పంపిణీతో ప్రతి సబ్జెక్టుకు గరిష్టంగా 100 మార్కులు కేటాయిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. CBSE వింటర్-బౌండ్ పాఠశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు నవంబర్ 5 నుంచి డిసెంబర్ 5 మధ్య జరుగుతాయి. ఈ పాఠశాలల్లో కూడా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, ప్రాజెక్ట్, ఇంటర్నల్ అసెస్మెంట్లను నిర్వహించడానికి బోర్డు SOPలు, మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.