NEET విద్యార్థి కలను కాపాడిన ACP.. రాష్ట్రపతి నిలయం గేట్లు తెరిపించి మరీ చారిత్రక సాహసం!

నీట్‌ 2026 రీ-ఎగ్జామ్‌కు పొరపాటున తప్పు పరీక్షా కేంద్రానికి చేరుకున్న ఓ విద్యార్థి, తన డాక్టర్‌ కావాలనే కల నెరవేరదేమోనని ఆందోళన చెందాడు. అయితే అతని పరిస్థితిని గమనించిన రమేశ్‌కుమార్ వెంటనే స్పందించి, ప్రత్యేక అనుమతులతో షార్ట్‌కట్ మార్గాన్ని ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రానికి సమయానికి చేర్చారు. దీంతో విద్యార్థి తన ఏడాది కష్టాన్ని వృథా కాకుండా కాపాడుకోగలిగాడు. ఏసీపీ చూపిన సమయస్ఫూర్తి, మానవతా దృక్పథానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి..

NEET విద్యార్థి కలను కాపాడిన ACP.. రాష్ట్రపతి నిలయం గేట్లు తెరిపించి మరీ చారిత్రక సాహసం!
Bollaram ACP Ramesh Kumar help NEET candidate

Updated on: Jun 22, 2026 | 1:11 PM

హైదరాబాద్‌, జూన్‌ 22: నీట్ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 22.74 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. ఇందులో 19.95 లక్షల మంది పరీక్షకు హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. తెలంగాణలో 208 కేంద్రాల్లో 73,059 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 65,087 మంది పరీక్ష రాశారు. పరీక్షల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు, ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమనే నిబంధనను కఠిన నిబంధన కారణంగా పలువురు విద్యార్ధులు చివరి నిమిషంలో వెనుదిరగవలసి వచ్చింది.

ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్‌లో తప్పు లొకేషన్లు, హాల్‌టికెట్లలో చిరునామాల గందరగోళం కారణంగా పలువురు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. టోలిచౌకికి చెందిన హసన్ హాష్మి అనే విద్యార్థి పొరపాటున తిరుమలగిరిలోని కేంద్రీయ విద్యాలయానికి చేరుకున్నాడు. తన అసలు పరీక్షా కేంద్రం బొల్లారంలో ఉందని తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పరీక్షకు కేవలం కొన్ని నిమిషాలే ఉండటంతో డాక్టర్‌ కావాలనే తన కల కరిగిపోతుందేమోనన్న ఆవేదన కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

అయితే విద్యార్థి పరిస్థితిని గమనించిన బొల్లారం ఏసీపీ రమేశ్‌కుమార్ వెంటనే స్పందించారు. ట్రాఫిక్ కారణంగా సాధారణ మార్గంలో సమయానికి చేరుకోవడం అసాధ్యమని భావించిన ఆయన.. ప్రత్యేక అనుమతితో రాష్ట్రపతి నిలయం ప్రధాన గేట్లను ప్రత్యేక అనుమతితో తెరిపించారు. అనంతరం పోలీసు వాహనంలో విద్యార్థిని షార్ట్‌కట్ మార్గం ద్వారా బొల్లారం కేంద్రీయ విద్యాలయానికి ఒక్క నిమిషం నిబంధన ముగిసేలోపు పరీక్షా కేంద్రంలోకి పంపించారు. దీంతో విద్యార్థి తన ఏడాది కష్టాన్ని వృథా కాకుండా కాపాడుకోగలిగాడు. ఏసీపీ రమేశ్‌కుమార్ చూపిన ఈ అసాధారణ సమయస్ఫూర్తి, మానవతా దృక్పథం వల్ల సదరు విద్యార్ధి నీట్ పరీక్ష రాయగలిగాడు. ఏసీపీ రమేశ్‌ కుమార్‌ చేసిన పనికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు. కాగా హాల్‌టికెట్లలో తప్పు చిరునామాల కారణంగా రంగారెడ్డి జిల్లాలో పలువురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్ద కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా నగరంలో దాదాపు 40 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు సమాయానికి ఎలాగోలా చేరుకున్నా.. మరికొందరు గందరగోళంలో ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చారు. పరీక్ష రాసే అవకాశం ఇలా అకారణంగా చేజారి పోవడంతో విద్యార్ధులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Follow Us