TGPSC Group 2 Ranker Success Story: గ్రూప్ 2లో మూడో ర్యాంక్ సాధించిన సంగారెడ్డి వాసి.. ఏకంగా 6 సర్కార్ కొలువులకు ఎంపిక!

ఉద్యోగమంటే తెలియని ఊర్లో పుట్టిన ఆయన తెలంగాణ ఉద్యమంతో ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన పెంచుకుని గ్రూప్‌ 2లో మూడో ర్యాంకు సాధించాడు సంగారెడ్డికి చెందిన బీర్‌దార్‌ మనోహర్‌రావు. కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం అసాధ్యమేమీ కాదనేనమ్మకంతో ప్రిపరేషన్‌ మొదలు సాగించి.. ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించి అందరినీ ఆశ్చర్చపరిచాడు..

TGPSC Group 2 Ranker Success Story: గ్రూప్ 2లో మూడో ర్యాంక్ సాధించిన సంగారెడ్డి వాసి.. ఏకంగా 6 సర్కార్ కొలువులకు ఎంపిక!
TGPSC Group 2 Ranker Manohar Rao

Updated on: Mar 13, 2025 | 4:33 PM

తెలంగాణ గ్రూప్ 2 ఫ‌లితాలు మార్చి 11న విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన జనరల్‌ ర్యాంకింగ్‌ల లిస్టులో సంగారెడ్డికి చెందిన బీర్‌దార్‌ మనోహర్‌రావు (బీసీ-డీ) 439.344 మార్కులతో మూడో ర్యాంకు సాధించాడు. ఈయన గతంలో నిర్వహించిన గ్రూప్‌ 2లో కూడా మూడో ర్యాంకు కొట్టాడు. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలంలోని ఉజ్జంపాడ్‌ గ్రామానికి చెందిన మనోహర్‌రావు చిన్నప్పటి చదువంతా ప్రభుత్వ బడుల్లోనే సాగింది. ఉద్యోగమంటే తెలియని ఊర్లో పుట్టిన ఆయన తెలంగాణ ఉద్యమంతో ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన పెంచుకున్నాడు. కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం అసాధ్యమేమీ కాదనేనమ్మకంతో ప్రిపరేషన్‌ మొదలు సాగించి.. ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించాడు.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మనోహర్‌రావు తండ్రి పండరినాథ్‌ కీర్తనకారుడు. తల్లి కమలమ్మ గృహిణి. మనోహర్‌రావు పీజీ ఎకనామిక్స్‌, బీఈడీ పూర్తి చేశాడు. ఆయనకు భార్య మనీష, కూతురు మనస్విని (3వ తరగతి), కొడుకు మహేశ్వర్‌ (ఒకటో తరగతి) ఉన్నారు. మనోహర్‌రావు 2017లో టీజీటీలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం, పీజీటీలో మూడో ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం మెదక్‌ జిల్లా కొల్చారం మండలం అంసాన్‌పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

ఓవైపు ఉద్యోగం చేస్తూనే 2020లో గ్రూప్‌ 2 పరీక్ష రాశాడు. అందులో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి 2020లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో డిప్యుటీ తహసీల్దార్‌గా చేరాడు. అయితే అనారోగ్యం కారణంగా 6 నెలల్లోపే రీపాట్రియేషన్‌ ద్వారా తిరిగి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాడు. ఇక తాజా గ్రూప్‌ 2 ఫలితాల్లో మారోమారు రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షలోనూ రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించి ఆ ఉద్యోగానికి అర్హత సాధించాడు. ఈ క్రమంలో మార్చి 12 (బుధవారం) హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగ నియమక పత్రం అందుకున్నాడు. త్వరలోనే మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరనున్నాడు.

ఇవి కూడా చదవండి

టీచర్‌ కొలువుకు ఆరు నెలలపాటు సెలవు పెట్టి పట్టుదలగా గ్రూప్‌ 2 పరీక్షకు చదివానని, హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో కోచింగ్‌ తీసుకున్నట్లు తెలిపాడు. రోజుకు 4 గంటలే నిద్రకు కేటాయించి.. మిగిలిన సమయమంతా చదువుకే కేటాయించినట్లు తెలిపాడు. డిప్యుటీ కలెక్టర్‌ ఉద్యోగం సాధించాలన్నది తన లక్ష్యమని. అందుకోసం మరోసారి ప్రయత్నిస్తానని అంటున్నాడు మనోహర్‌రావు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us