
అమరావతి, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వచ్చేనెల 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మెయిన్స్ పరీక్షలు మొత్తం 7 పేపర్లకు జరుగుతాయి. అన్ని పేపర్లలోని ప్రశ్నలకు వ్యాస రూపంలో మాత్రమే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఇకపై తెల్ల కాగితాలతో కూడిన బుక్లెట్ను మాత్రమే అందజేస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. గతంలోనైతే గడుల (రూల్డ్)తో కూడిన బుక్లెట్ ఇచ్చేవారు. అయితే వీటిల్లో జవాబులు రాయడం కష్టంగా ఉందని, డయాగ్రామ్లు వేయడంలో ఇబ్బందులు తలెత్తుతుందని పలువురు అ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు తెల్ల పేపర్ల బుక్లెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పి రాజబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు.
బుక్లెట్పై సమాధానాలు రాసేందుకు జెల్, ఇంక్ పెన్నులను అనుమతించబోమని స్పష్టం చేశారు. వీటిని ఉపయోగిస్తే మూల్యాంకనంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. వీటికి బదులుగా బాల్ పాయింట్ పెన్నులతో మాత్రమే జవాబులు రాయాలని సూచించారు. పరీక్షల్లో స్కెచ్ పెన్ను ఉపయోగిస్తే మాల్ప్రాక్టీసు కింద గుర్తిస్తామని హెచ్చరించారు. అటువంటి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం కుదరదని తేల్చి చెప్పారు. కొత్త బుక్లెట్ను త్వరలో ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో పెడతామని రాజబాబు పేర్కొన్నారు. కాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మే 03 నుంచి 09 తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఏపీపీఎస్సీ షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.