
అమరావతి, మార్చి 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మొదలైన ఈ పరీక్షలు మార్చి 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 10,57,312 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలు రాస్తున్నారు. ఇక ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం రేపట్నుంచి మొదలుకానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సోమవారం నుంచి మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభించనున్నారు.
వడివడిగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. ఇప్పటికే ఇంటర్ ప్రధాన పరీక్షలన్నీ మార్చి 18తో ముగిశాయి. ప్రధాన పరీక్షలు ముగిసినందున మార్చి 23 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మూల్యాంకనం చేసే జూనియర్ లెక్చరర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో లెక్చరర్కు ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబు పత్రాలను మూల్యాంకనానికి ఇస్తారు. అయితే మూల్యాంకనం చేసేటప్పుడు చేతిరాత బాలేదనే కారణంతో విద్యార్ధులకు మార్కులు తగ్గించొద్దని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థి రాసిన సమాధానాల ఆధారంగానే మూల్యాంకనం చేయాలని, చేతిరాత, విద్యార్థి నేపథ్యం, ఊహాగానాలకు ప్రాధాన్యమివ్వకూడదని చెప్పింది.
సమాధానాలు పూర్తిగా చదవకుండా మార్కులు ఇవ్వకూడదు. సమాధానం సరిగా ఉంటే చేతిరాతను చూసి మార్కులు తగ్గించకూడదని స్పష్టం చేసింది. మూల్యాంకనం పూర్తయ్యాక తిరిగి పరిశీలించి, మార్కులు స్పష్టంగా బబుల్ చేయాలని పేర్కొంది. అలాగే మూల్యాంకనంలో పొరపాట్లు వస్తే భారీగా జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది. పేపరు మూల్యాంకనం చేసిన వారికి రూ.3,000 నుంచి రూ.7,500 వరకూ, పరిశీలించినవారికి రూ.2,000 నుంచి రూ.3,750 వరకూ జరిమానాలు ఉంటాయని తెలిపింది. మార్కుల వ్యత్యాసం వస్తే మూల్యాంకనం నుంచి డీబార్ చేస్తామని హెచ్చరించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.