
హైదరాబాద్, మార్చి 20: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. మార్చి 25 నాటికి మూల్యాంకనం ప్రక్రియ కూడా పూర్తి చేసి ఏప్రిల్ 6వ తేదీ నాటికే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు మొదలవుతాయి. జూన్ 1 నుంచి తిరిగి జూనియర్ కాలేజీలు పునఃప్రారంభమవుతాయి. ఈలోగా అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలను కూడా ముగించి మే 31 నాటికి ఫలితాలు ప్రకటించాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఏటా ఆలస్యంగా ఫలితాలు విడుదల చేస్తుండటంతో విద్యాబోధనపై తీవ్ర ప్రభావం పడుతుంది. జూన్లో కాలేజీలు ప్రారంభమైనా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, మూల్యాంకనం వంటి వాటితో సమయం వృథా అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇంటర్ బోర్డు అధికారులు ఈసారి కాస్త త్వరగానే ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు.
మరోవైపు ఏపీలోనూ ఏప్రిల్ రెండో వారంలోగా ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించే దిశగా రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన పరీక్షలన్నీ బుధవారం (మార్చి 18)తో ముగిశాయి. మిగిలిన పరీక్షలు మార్చి 25వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 22 నుంచి రాష్ట్రంలో ఇంటర్ జవాబుపత్రాల మూల్యాకనం మొదలుకానుంది. నిజానికి మార్చి 21 నుంచే మూల్యాంకనం ప్రక్రియ మొదలు కావల్సి ఉంది. అయితే మార్చి 21న రంజాన్ పండగ నేపథ్యంలో ఈ ప్రక్రియ సోమవారం నుంచి మొదలవనుంది. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా ప్రకటించారు. ఇక ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 10లోపు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.