AP 10th Class Exams: ‘పది’ పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం

|

Mar 19, 2024 | 8:41 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం (మార్చి 18) నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజు ఓ పరీక్ష కేంద్రంలోని విద్యార్ధినికి ఇన్విజిలేటర్‌ నిర్లక్ష్యం మూలంగా తీవ్ర అన్యాయం జరిగింది. ఒక పేపర్‌కు బదులు మరొక పేపర్‌ అందించడంతో ఏం చేయాలో తెలియక బోరున విలపించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కారంపూడిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సోమవారం (మార్చి 18) చోటు చేసుకుంది..

AP 10th Class Exams: పది పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
AP 10th Class Exams
Follow us on

కారంపూడి, మార్చి 19: రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం (మార్చి 18) నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజు ఓ పరీక్ష కేంద్రంలోని విద్యార్ధినికి ఇన్విజిలేటర్‌ నిర్లక్ష్యం మూలంగా తీవ్ర అన్యాయం జరిగింది. ఒక పేపర్‌కు బదులు మరొక పేపర్‌ అందించడంతో ఏం చేయాలో తెలియక బోరున విలపించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కారంపూడిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సోమవారం (మార్చి 18) చోటు చేసుకుంది. కస్తూర్బా విద్యాలయం ఉపాధ్యాయినులు, సిబ్బంది చేసిన తప్పిదంతో పదో తరగతి బాలికకు అన్యాయం జరిగింది. వివరాల్లోకెళ్తే..

కారంపూడిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థిని బాణావత్‌ ప్రియాంకబాయి అనే విద్యార్ధిని పదోతరగతి చదువుతోంది. నిన్నటి నుంచి ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ప్రియాంకబాయి కూడా హాజరైంది. అయితే సోమవారం తెలుగు పరీక్ష రాసేందుకు విద్యార్థిని ఆదర్శ పాఠశాలలోని పరీక్షా కేంద్రానికి వెళ్లింది. అక్కడ పరీక్ష ప్రారంభం కాగానే ఇన్విజిలేటర్‌ తెలుగు ప్రశ్నాపత్రానికి బదులు హిందీ ప్రశ్నపత్రం అందించడంతో విద్యార్థిని అవాక్కైంది. తాను తెలుగు మీడియం చదువుతున్నానని, ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ కింద తెలుగు పరీక్ష రాయాల్సి ఉందని విద్యార్థిని చెప్పినా ఇన్విజిలేటర్‌ వినిపించుకోలేదు. హాల్‌ టిక్కెట్టులో ప్రథమ భాష హిందీ సబ్జెక్ట్‌ ఉందని, అందువల్లనే హిందీ పేపరు ఇచ్చినట్లు ఇన్విజిలేటర్‌ బదులివ్వడంతో.. ఏం చేయాలో తోచక బాలిక బోరున విలపించింది.

దీంతో దిక్కుతోచని స్థితిలో పరీక్ష ముగిసేంత వరకూ పరీక్ష గదిలోనే విద్యార్థిని ప్రియాంకబాయి కూర్చుని ఉండిపోయింది. పరీక్ష సమయం అనంతరం వెంటనే జరిగిన విషయాన్ని కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రిన్సిపల్‌కు తెలియజేసింది. బాలిక కుటుంబ సభ్యులు ఇదే విషయమై విద్యాలయం సిబ్బందిని ప్రశ్నించగా దరఖాస్తు సమయంలో తప్పు జరిగిందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని నింపాదిగా చెప్పుకొచ్చారు. విధుల నిర్వహణలో విద్యాలయం ఉపాధ్యాయినులు, సిబ్బంది చేసిన తప్పిదానికి విద్యార్ధిని నష్టపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.