
అమరావతి, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్లో ఆశావర్కర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,294 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. తాజాగా మరో 913 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ నియామక ప్రక్రియను జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించే డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ నెల 30వ తేదీలోగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఆశావర్కర్ పోస్టులకు సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలను అర్హులుగా పరిగణించనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన ఆశావర్కర్లకు ప్రభుత్వం నెలకు రూ.10,000 చొప్పున గౌరవ వేతనం అందించనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలను చేరువ చేయడంలో ఆశావర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ నియామకాలకు ప్రాధాన్యం ఏర్పడింది.