హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో నాన్ లోకల్ విధానం పూర్తిగా రద్దుకానుంది. ఈ మేరకు ఉన్నత వర్గాలు వెల్లడించాయి. గతంలో కన్వీనర్ కోటా కింద బీటెక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థుకు మాత్రమే కాకుండా నాన్ లోకల్ కింద 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాలో కేటాయించేవారు. అయితే తెలుగు రాష్ట్రాల విభజన నిబంధనల ప్రకారం పదేళ్లు పూర్తి కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్ధులకు ఈసారి ఇంజనీరింగ్ సీట్లు దక్కే అవకాశం లేదు.
ఇప్పటివరకు ఇంజినీరింగ్ సీట్లను 70 శాతం కన్వీనర్ కోటా, 30 శాతం బి కేటగిరీ (యాజమాన్యం) కింద భర్తీ చేస్తున్నారు. కన్వీనర్ కోటాలోని సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులకే కేటాయించేవారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడేందుకు అవకాశం ఉండేది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి అయినందున స్థానికత, స్థానికేతర కోటా తదితర అంశాల విషయంలో అధ్యయనం చేసేందుకు గత ఏడాది డిసెంబరులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ తాజాగా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించాలని పేర్కొంది. ఇందులో 95 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 5 శాతం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్ధులకు ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ మేరకు 95-5 కోటాపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు. ఈ నిబంధనల మేరకే ఈఏపీసెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు.
కమిటీ సిఫారసును ప్రభుత్వం ఆమోదిస్తే తెలంగాణ విద్యార్థులకు మొత్తం ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. గతంలో 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాలో మొత్తం 12 వేల సీట్లు ఉండేవి. ఇందులో 4 నుంచి 5 వేల వరకు సీట్లు మెరిట్ ఆధారంగా ఏపీ విద్యార్థులు పొందేవారు. తాజాగా నాన్లోకల్ కోటా రద్దు కానుండటంతో ఇకపై ఏపీ విద్యార్ధులు తెలంగాణలో ఇంనీరింగ్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోనున్నారు. కాగా తెలంగాణ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ గురువారం మధ్యాహ్నం విడుదల కానున్నట్లు ఇప్పటికే ఉన్నత విద్యామండలి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.