రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కీలక నివేదిక..

బంగారం ధర కొంచెమైనా తగ్గకపోతుందా? పసిడి కొనుగోలు సామాన్యుడికి అందుబాటులోకి రాదా? అని కోట్లాది మంది ఎదురుచూస్తున్న వేళ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక ప్రతిపాదన చేసింది. మన దేశంలో బంగారాన్ని కేవలం ఒక లోహంగా కాకుండా అధికారికంగా వ్యూహాత్మక ఖనిజంగా ప్రకటించాలని కోరింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కీలక నివేదిక..
Gold Price Forecast India 2026

Updated on: Aug 10, 2026 | 7:59 PM

బంగారం అంటే భారతీయులకు స్పెషల్ సెంటిమెంట్. పండగైన, పెళ్లిళ్లు అయినా బంగారం కొనాల్సిందే. అంతేకాకుండా ఆపదసమయాల్లో ఆదుకునే కొండంగా అండగా బంగారానికి పేరు. అయితే పసిడి ప్రియులకు, సామాన్యులకు బంగారం ధరల హెచ్చుతగ్గులు ఎప్పుడూ ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. ధరలు కొద్దిగానైనా తగ్గకపోతాయా అని మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఈ తరుణంలో భారతదేశంలో బంగారం వినియోగం, ఉత్పత్తి, ధరల నియంత్రణపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విప్లవాత్మకమైన సిఫార్సులు చేసింది. ఇటీవల WGC విడుదల చేసిన స్వర్ణీమ్ ఉధాన్ 2047 నివేదిక ప్రకారం.. మన దేశంలో బంగారాన్ని ఒక సాధారణ లోహంగా కాకుండా, అధికారికంగా వ్యూహాత్మక ఖనిజంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

వ్యూహాత్మక ఖనిజం హోదా ఇస్తే ఏం జరుగుతుంది?

ప్రస్తుతం మన దేశంలో ఏ ప్రాంతంలోనైనా మైనింగ్ కార్యకలాపాలు చేపట్టాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్యావరణ, అటవీ అనుమతులు పొందడం చాలా సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. WGC ఇండియా రీజినల్ సీఈఓ సచిన్ జైన్ ప్రకారం.. బంగారానికి వ్యూహాత్మక ఖనిజం హోదా ఇస్తే.. మైనింగ్ కంపెనీలు అనుమతుల కోసం వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన అవసరం ఉండదు. కేంద్రం నుంచే ఒకే చోట అనుమతులు సులభంగా లభిస్తాయి. భారత్‌లో బంగారం నిల్వలు ఉన్నప్పటికీ, తవ్వకాలు జరపడం ఖరీదైన వ్యవహారం కావడం వల్ల ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావడం లేదు. ఈ హోదా ఇస్తే మైనింగ్ కంపెనీల పెట్టుబడులు పెరిగి, దేశీయంగా బంగారం ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉంది. భారీగా జరుగుతున్న బంగారం దిగుమతుల వల్ల దేశ విదేశీ మారక నిల్వలపై పడుతున్న తీవ్ర ఒత్తిడి తగ్గుతుంది.

దేశంలో ఉత్పత్తి పెరిగితే బంగారం ధర తగ్గుతుందా?

దేశంలో బంగారం తవ్వకాలు పెరిగినంత మాత్రాన తక్షణమే ధరలు తగ్గుతాయని అనుకోవడం పొరపాటేనని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో బంగారం ధరలు కేవలం స్థానిక లభ్యతపైనే కాక, అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: ఇరాన్ సంక్షోభం, అంతర్జాతీయంగా చమురు సరఫరాలో సంక్షోభం వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించి కొనుగోళ్లు పెంచుతారు. దీనివల్ల ధర పెరుగుతుంది.

డాలర్ విలువ పడిపోవడం: సాధారణంగా అమెరికన్ డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. పెట్టుబడిదారులు యూఎస్ సెక్యూరిటీల నుంచి డబ్బులు ఉపసంహరించుకుని బంగారంలో పెట్టుబడి పెడుతుండటం వల్ల ఇటీవల పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి.

ఇళ్లలోని బంగారంతో రూ.3.1 లక్షల కోట్ల దిగుమతులు బంద్

భారతీయ గృహాల్లో టన్నుల కొద్దీ బంగారం నిల్వ ఉంది. WGC అంచనాల ప్రకారం.. దేశంలోని ఇళ్లలో ఉన్న మొత్తం బంగారంలో కేవలం 1 శాతాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే, ఏటా సుమారు రూ.3.1 లక్షల కోట్ల విలువైన బంగారం దిగుమతులను అడ్డుకోవచ్చని తెలిపింది. అయితే సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లలోని బంగారం అనేది అత్యవసర సమయాల్లో కొండంత అండగా ఉండే ఆర్థిక భద్రత. కాబట్టి సామాన్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనలను అమలు చేయాల్సి ఉంటుంది.

బంగారానికి వ్యూహాత్మక ఖనిజం హోదా కల్పించి, సింగిల్ విండో పద్ధతి తెస్తే దేశీయంగా మైనింగ్ రంగానికి నూతన ఊపిరి లభిస్తుంది. కానీ, అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, డాలర్ ప్రభావం ఉన్నంతవరకు సామాన్యుడికి బంగారం ధరల నుంచి తక్షణ ఊరట లభిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us