ఉన్నపళంగా పాత బంగారం అమ్మేస్తున్న భారతీయులు! సడన్‌గా ఏమైంది..? కారణాలు ఇవేనా?

బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరి, ఆపై స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో, అనేక కుటుంబాలు తమ పాత బంగారు ఆభరణాలను విక్రయించి నగదుగా మార్చుకుంటున్నాయి. ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనే అంచనాలతో, వినియోగంలో లేని బంగారాన్ని అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.

ఉన్నపళంగా పాత బంగారం అమ్మేస్తున్న భారతీయులు! సడన్‌గా ఏమైంది..? కారణాలు ఇవేనా?
Indians Selling Old Gold

Updated on: Jun 30, 2026 | 2:51 PM

రికార్డు స్థాయికి చేరిన తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు తమ వద్ద ఉన్న పాత బంగారు ఆభరణాలను విక్రయించి నగదుగా మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అధిక ధరలను సద్వినియోగం చేసుకోవాలని చాలామంది భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతీయ కుటుంబాలు దాదాపు 50 టన్నుల పాత బంగారాన్ని విక్రయించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరిన సమయంలో లాభాలను పొందేందుకు ప్రజలు పెద్దఎత్తున అమ్మకాలకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరగా, ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో కొంత తగ్గాయి. ప్రస్తుతం ధరలు ఇంకా అధికంగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మరింత తగ్గవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగంలో లేని పాత ఆభరణాలను విక్రయించి నగదు పొందాలని అనేక కుటుంబాలు నిర్ణయించుకుంటున్నాయి. ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ.. అధిక ధరలను లాభంగా మార్చుకునేందుకు వినియోగదారులు ముందుకు వస్తున్నారని తెలిపారు. ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనే భావన కూడా అమ్మకాలకు ప్రధాన కారణంగా మారిందన్నారు.

ఇదీ చదవండి: కేవలం రూ.50లతో రూ.35 లక్షలు పొందే ఛాన్స్! మిస్ అయితే నష్టపోతారు..

పాత బంగారం విక్రయాలు పెరగడంతో దేశంలోని బంగారం రీసైక్లింగ్ పరిశ్రమకు కూడా ఊతం లభిస్తోంది. గృహాల్లో నిరుపయోగంగా ఉన్న ఆభరణాలను సేకరించి వాటిని శుద్ధి చేసి మళ్లీ ఆభరణాల తయారీదారులకు సరఫరా చేస్తున్నారు. ముత్తూట్ ఎగ్జిమ్ సంస్థ తన గోల్డ్ పాయింట్ల నెట్‌వర్క్‌లో పాత బంగారం లావాదేవీలు 40 శాతం పెరిగినట్లు వెల్లడించింది. వినియోగదారులు పారదర్శకమైన వ్యవస్థీకృత మార్గాల్లో బంగారాన్ని విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారని సంస్థ సీఈఓ కీయుర్ షా పేర్కొన్నారు.

ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. అయితే దేశ అవసరాల్లో అధిక భాగం దిగుమతుల ద్వారానే తీరుతోంది. ప్రస్తుతం రీసైకిల్ అయ్యే బంగారం పరిమాణం పెరగడం వల్ల దిగుమతులపై ఆధారపడటం కొంత మేర తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారతీయ కుటుంబాల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం నిల్వ ఉందని అంచనా వేస్తున్నారు. అయితే బంగారాన్ని విక్రయించే నిర్ణయం కేవలం ధరల హెచ్చుతగ్గులను చూసి కాకుండా, వ్యక్తిగత ఆర్థిక అవసరాలు, భవిష్యత్తు పెట్టుబడి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వినియోగంలో లేని పాత ఆభరణాలను నగదుగా మార్చుకోవడానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారం ఇప్పటికీ కీలకమైన ఆస్తిగానే పరిగణించబడుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us