
Aadhaar Card: మన దేశంలో నేడు ప్రతి పౌరుడికి అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం ఆధార్ కార్డు. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. అయితే, ఇంతటి భారీ జనాభా ఉన్న దేశంలో ఈ ‘యూనిక్ ఐడెంటిఫికేషన్’ (Unique Identification) అనే ఆలోచన ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అన్న విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఒకప్పుడు భారతదేశంలో ఒక వ్యక్తి తన గుర్తింపును నిరూపించుకోవడానికి కేవలం రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి మాత్రమే ఉండేవారు. కానీ వీటిలో ఒక పెద్ద లోపం ఉండేది. మధ్యవర్తులు సులభంగా నకిలీ (Duplicate) కార్డులను సృష్టించి, ప్రభుత్వ సొమ్మును, సబ్సిడీలను దోచుకునేవారు. ఈ గందరగోళానికి చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని. 2009లో అప్పటి ప్రభుత్వం ఆయనను ఆహ్వానించి, దేశంలోని ప్రతి పౌరుడికి ఒకే గుర్తింపు కార్డు ఇచ్చే బాధ్యతను అప్పగించింది.
కేవలం పేరు, అడ్రస్ మాత్రమే కాకుండా, ఒక మనిషి వేలిముద్రలు (Fingerprints), కంటి పాపల డేటాను కూడా ఆధార్లో సేకరించారు. దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే, ప్రపంచంలో ఒకరి వేలిముద్రలు మరొకరితో ఎప్పటికీ మ్యాచ్ అవ్వవు. దీనివల్ల నకిలీ కార్డులను సృష్టించడం అసాధ్యంగా మారింది.
ఆధార్ కార్డు వల్ల పారదర్శకత పెరిగింది. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడం సులభమైంది. నేడు డిజిటల్ ఇండియాలో ఆధార్ ఒక కీలకమైన భాగంగా మారిపోయింది.
ఈ విధంగా నందన్ నిలేకని దూరదృష్టి, సాంకేతిక పరిజ్ఞానం వల్ల భారతదేశం ఒక పటిష్టమైన గుర్తింపు వ్యవస్థను నిర్మించుకోగలిగింది. ఈ రోజుల్లో ఆధార్ అనేది కీలకంగా మారిపోయింది. ఏ చిన్న పని ఉన్నా ఆధార్ తప్పనిసరి అయిపోయింది. అంతేకాదు ఆధార్ కార్డు అన్ని డాక్యుమెంట్లకు లింకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ఆన్లైన్ మోసాలు, ఇతర స్కీమ్లను దృష్టిలో ఉంచుకుని ఆధార్ను మరింత భద్రతతో అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి