
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా, ఇరాన్ యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. చమురు సంక్షోభం భయాలు వెంటాడుతున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది పాటు ఎవరూ బంగారం కొనవద్దు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయులకు విజ్ఞప్తి చేశారు. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు ఉన్నా సరే, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ దేశాల వద్ద ఎంత బంగారం ఉంది? భారత్ ఏ స్థానంలో ఉంది? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
హైదరాబాద్లోని సికింద్రాబాద్లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ముడి చమురు ధరలు మండిపోతున్నాయని, ఇది విదేశీ మారక ద్రవ్య నిల్వలపై విపరీతమైన ఒత్తిడి తెస్తోందని అన్నారు. మనం కొనే ప్రతి గ్రాము బంగారం కోసం డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోందని, ఆ డాలర్లను దేశ అవసరాల కోసం ఆదా చేయాలని ఆయన కోరారు. కేవలం బంగారం మాత్రమే కాదు, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, పెట్రోల్ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాల జాబితాను పరిశీలిస్తే అమెరికా తిరుగులేని విజేతగా నిలిచింది.
అమెరికా: దాదాపు 8,133.50 టన్నుల నిల్వలతో అగ్రస్థానంలో ఉంది.
జర్మనీ: 3,351.5 టన్నులతో రెండో స్థానంలో నిలిచింది.
ఇటలీ – ఫ్రాన్స్: వరుసగా 2,452 టన్నులు మరియు 2,437 టన్నులతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
రష్యా – చైనా: రష్యా (2,333 టన్నులు), చైనా (2,303.50 టన్నులు) ఐదు, ఆరో స్థానాల్లో కొనసాగుతున్నాయి.
బంగారం వినియోగంలో ప్రపంచంలోనే ముందు వరుసలో ఉండే భారత్.. నిల్వల విషయంలో ఎనిమిదో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద సుమారు 880 టన్నులకు పైగా బంగారం ఉంది. భారత్ ఏటా దాదాపు 750 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా మన దేశం తన అవసరాల కోసం 40 శాతం బంగారాన్ని స్విట్జర్లాండ్ నుంచే దిగుమతి చేసుకోవడం గమనార్హం.
ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అందుకే అనేక దేశాలు తమ నిల్వలను పెంచుకుంటున్నాయి.