మధ్యతరగతి ప్రజలకు అద్దిరిపోయే న్యూస్.. ఈసారి పొదుపు పధకాల పరిమితి డబుల్!

|

Feb 06, 2023 | 10:01 AM

ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా ఆదాయపు పన్ను శ్లాబును మార్చింది మోదీ సర్కార్. అదే సమయంలో, కొత్త పన్ను విధానంలో..

మధ్యతరగతి ప్రజలకు అద్దిరిపోయే న్యూస్.. ఈసారి పొదుపు పధకాల పరిమితి డబుల్!
Ppf
Follow us on

ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా ఆదాయపు పన్ను శ్లాబును మార్చింది మోదీ సర్కార్. అదే సమయంలో, కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను రాయితీని కూడా ప్రకటించారు. దీనితో పాటు, కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ప్రజలు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటితో పాటు బడ్జెట్ 2023లో వెలువడిన ప్రకటనలతో వృద్దులకు కూడా మేలు కలుగుతుంది.

మరోవైపు బడ్జెట్ అనంతర చర్చలో ఆర్థిక శాఖ కార్యదర్శి టి.వి.సోమనాథన్ ఈ బడ్జెట్ ప్రకటనలు మధ్యతరగతికి ప్రయోజనకరంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పరిమితిని పెంచాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయడమే దీనికి వెనుక ముఖ్య ఉద్దేశం అని అన్నారు.

వృద్ధులు, మధ్యతరగతి ప్రజలు తమ పొదుపులను ఎక్కువ రాబడిని ఇచ్చే సురక్షితమైన ప్రభుత్వ డిపాజిట్ పథకాలలో పెడుతుంటారు. 2023-24 బడ్జెట్‌లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌కు గరిష్ట పెట్టుబడి పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది. దీనితో పాటు, మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ స్కీమ్ గరిష్ట డిపాజిట్ పరిమితిని సింగిల్ అకౌంట్‌కు రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు, జాయింట్ ఖాతాకు రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

అలాగే పోస్టాఫీసులో నెలవారీ ఆదాయ పథకాల్లో పెట్టుబడి పరిమితి 1987వ సంవత్సరం నుంచి మారలేదు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) విషయంలో పెట్టుబడి పరిమితి 2004లో నిర్ణయించబడింది. ప్రస్తుతానికి, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో ఇచ్చే 8 శాతం వడ్డీ కంటే తక్కువ ఖర్చుతో ప్రభుత్వం మూలధనాన్ని సేకరించవచ్చు. అయితే సీనియర్ సిటిజన్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అధిక వడ్డీని భరించాలని నిర్ణయించింది.

అదేవిధంగా, మధ్యతరగతి ప్రజలకు, వృద్ధులకు ఎక్కువ రాబడిని ఇచ్చే నెలవారీ ఆదాయ పథకం(MIS) లో పెట్టుబడి పరిమితిని సవరించాలని నిర్ణయించింది. ఇది ఐదేళ్ల డిపాజిట్ పథకం. దీనికి 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ల కింద ఖాతాలను 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు తెరవవచ్చు. ఇందులో 5 సంవత్సరాల పాటు డబ్బు డిపాజిట్ చేయవచ్చు.