
ఇండియాలో డిజిటల్ అంతరాన్ని తగ్గించే దిశగా ఒక కీలక పరిణామంగా, స్పేస్ ఎక్స్ కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ విభాగం స్టార్లింక్, మేఘాలయ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని కొండలు, లోయలు వంటి భౌగోళికంగా క్లిష్ట ప్రాంతాల్లో శాటిలైట్ ఆధారిత హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సంప్రదాయ టెలికాం నెట్వర్క్లు చేరుకోలేని ప్రాంతాల్లో ఫైబర్ ఏర్పాటు ఖరీదైనదిగా, సాంకేతికంగా క్లిష్టంగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత సంతరించుకుంది. మేఘాలయలో ఇప్పటివరకు ఇంటర్నెట్ కనెక్టివిటీ స్థిరంగా లేకపోవడం విద్య, ఆరోగ్య రంగాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో స్టార్లింక్ సేవలతో గ్రామీణ పాఠశాలలకు స్థిరమైన ఆన్లైన్ విద్యా సదుపాయం అందే అవకాశం ఉంది.
అలాగే కొండప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలు టెలిమెడిసిన్, డిజిటల్ రికార్డుల వినియోగాన్ని మెరుగుపరుచుకోగలవు. విపత్తు పరిస్థితుల్లో కూడా కమ్యూనికేషన్ నిలిచిపోకుండా ఉండటం వల్ల రక్షణ చర్యలు వేగవంతం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ అభివృద్ధికి తోడ్పడే మరో అంశం, స్టార్లింక్కు IN-SPACe నుంచి భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు లైసెన్స్ లభించడం. దీంతో రాబోయే ఐదేళ్ల పాటు సంస్థ తన ఉపగ్రహ సేవలను చట్టబద్ధంగా అందించగలదు. ముంబైలో ఇప్పటికే సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా సేవల సామర్థ్యాన్ని కూడా నిరూపించింది.
భారత మార్కెట్పై దృష్టి పెట్టిన స్టార్లింక్, బెంగళూరులో కార్యాలయం ఏర్పాటు చేసి నియామక ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇది కేవలం మేఘాలయకు పరిమితం కాకుండా, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా సేవలను విస్తరించాలనే సంకేతాలను ఇస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం, UIDAI వంటి సంస్థలు కూడా శాటిలైట్ కనెక్టివిటీ వినియోగంపై ఆసక్తి చూపుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా వాణిజ్య సేవల ప్రారంభానికి ముందు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి తుది అనుమతులు అవసరం. స్పెక్ట్రమ్ ధరలు, కేటాయింపు వంటి అంశాలపై ఈ సంస్థల నిర్ణయాలు కీలకం కానున్నాయి. ధరల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గతంలో లీకైన వివరాలు తాత్కాలికమని కంపెనీ పేర్కొన్నప్పటికీ, తుది ధరలు నియంత్రణ సంస్థల అనుమతుల తర్వాతే వెల్లడవుతాయి. మొత్తంగా స్టార్లింక్ ప్రవేశం భారతదేశంలో కనెక్టివిటీ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..