
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే భారీ శుభవార్త అందించింది. కొత్తగా రైల్ పార్శిల్ బుకింగ్ యాప్ను బుధవారం ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్లోని రైల్ నిలయంలో జరిగిన కార్యక్రమంలో యాప్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ కుమార్ శ్రీవాత్సవ లాంచ్ చేశారు. హైదరాబాద్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో దక్షిణ మధ్య రైల్వే ఈ యాప్ను తయారుచేసింది. దీంతో రైల్వే ప్రయాణికులకు కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి లాజిస్టిక్ సేవలను కూడా ప్రజలు పొందవచ్చు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో పార్శిళ్లు పంపించవచ్చు. అంతేకాకుండా పికప్ నుంచి డెలివరీ వరకు అన్నీ మొబైల్ యాప్ ద్వారానే సేవలు పొందవచ్చు.
రైల్ పార్శిల్ సర్వీసులు ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నైలో అందుబాటులోకి వచ్చాయి. తొలుత హైదరాబాద్ డివిజన్లో దీనిని దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా రైల్వేశాఖ ప్రారంభించింది. ఇది విజయవంతం కావడంతో ఇప్పుడు అధికారికంగా యాప్ను ప్రారంభించి మరిన్ని ప్రాంతాలకు పార్శిల్ సేవలను విస్తరించింది. దీని వల్ల ప్రజలు ఇంటి వద్ద నుంచే సులువుగా తమ పార్శిల్స్ రైళ్ల ద్వారా పంపించుకోవచ్చు. యాప్ ద్వారా పార్శిల్ బుకింగ్ చేసుకోవడంతో పాటు డెలివరీ అయ్యే వరకు ట్రాక్ చేసుకోవచ్చు.
ఇక వ్యాపారులు కూడా సులభంగా, వేగంగా పార్శిల్స్ తమ కస్టమర్లకు పంపించుకోవచ్చు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా పికప్ కోసం బుకింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కస్టమర్కు అందిందా..? లేదా? అనేది ట్రాక్ చేసుకోవచ్చు. వన్ స్టాప్ వేదికగా ఈ యాప్ ఉండనుంది. ఇక పరిశ్రమలు, లాజిస్టిక్స్ పార్టనర్లను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ యాప్ ఉపగయోగపడుతుంది. అతి వేగంగా ట్రైన్ల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పార్శిళ్లు పంపించుకోవచ్చని, ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ తెలిపింది.
ఈ సందర్భంగా దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ .. విప్లవాత్మక రైల్ పార్శిల్ యాప్ను అమలు చేసిన మొదటి జోన్ గా దక్షిణ మధ్యరైల్వే కావడం చాలా గర్వకారణమని అన్నారు. పార్శిల్ వ్యాపారం భారతీయ రైల్వేలో ఇప్పటివరకు కొనసాగుతుందని, ఇప్పుడు డిజిటల్ పరివర్తన కొత్త యుగంలోకి ప్రవేశిస్తోందని ఆయన పేర్కొన్నారు. రైల్ పార్శిల్ యాప్ పార్శిల్ కార్యాలయాన్ని వినియోగదారుల వద్దకు తీసుకువస్తుందని, వివిధ ఫారాలను పూరించడం లేదా పొడవైన క్యూలలో నిలబడవలసిన అవసరాన్ని తొలగిస్తుందని ఆయన పేర్కొన్నారు.