
House Construction Costs: సొంతింటి కల ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఇంటి నిర్మాణం అనేది ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుత రోజుల్లో నిర్మాణానికి అవసరమైన ముడిసరుకుల ధరలు నిరంతరం పెరుగుతూ ఉండటంతో నిర్మాణ వ్యయం కూడా అధికమవుతోంది. ఈ నేపథ్యంలో, ఇంటి నిర్మాణ ఖర్చును గణనీయంగా తగ్గించుకోవడానికి ఇండస్ట్రీ నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. సరైన ప్రణాళికతో, సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో ఇంటి నిర్మాణం చేపడితే 10 నుంచి 20 శాతం మేర వ్యయాన్ని తగ్గించుకోవచ్చని వారు తెలియజేస్తున్నారు.
ఇంటి నిర్మాణం కోసం కేవలం డబ్బులు ఉంటే సరిపోదు, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఇది అనుకున్న సమయంలో, నిర్దేశిత బడ్జెట్లో ఇంటి నిర్మాణం పూర్తవడానికి తోడ్పడుతుంది. దీనిలో ప్రధానమైనది ఇంటి ప్లాన్. సొంతంగా డ్రాయింగ్లు వేయడం లేదా మేస్త్రీపై పూర్తిగా వదిలేయడం వంటివి కాకుండా, అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్తో ప్లాన్ను గీయించుకోవాలి. చాలామంది ఇంజినీర్కు ఫీజు అనవసరం అనుకుని రెడీమేడ్ ప్లాన్లను ఎంచుకుంటారు. కానీ ఇంజినీర్ను సంప్రదిస్తే, వారు మీ స్థలాన్ని పరిశీలించి, మీ ఆలోచనలకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన ప్లాన్ను రూపొందిస్తారు.
ఇది కూడా చదవండి: Pregnancy: 9 నెలల గర్భం.. ఆపరేషన్ చేయగా కడుపులో బిడ్డ మాయం.. డాక్టర్లు షాక్.. మైండ్ బ్లోయింగ్ నిజం!
ఇంజినీర్ ఇచ్చే ప్లాన్తో పాటు స్ట్రక్చరల్ డిజైన్లు తీసుకోవడం ద్వారా పునాదులు, కాలమ్స్, బీమ్స్ ఎక్కడెక్కడ వస్తాయి, ఎంత స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుకలు అవసరమో స్పష్టంగా తెలుస్తుంది. ఇది నిర్మాణ వ్యయాన్ని అంచనా వేయడంలో, అనవసర వృధాను నివారించడంలో సహాయపడుతుంది. కాలమ్స్, బీమ్స్, స్లాబ్లు, గోడలు కట్టిన తర్వాత మార్పులు చేర్పులు చేయడం సర్వసాధారణం. గోడలు పగులగొట్టడం, స్లాబ్లను తొలగించడం వంటివి ఖర్చును పెంచుతాయి. కాబట్టి ఇంజినీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారమే నిర్మించాలని మేస్త్రీకి స్పష్టంగా చెప్పాలి.
నిర్మాణ వ్యయం తగ్గించడంలో మెటీరియల్ వృధాను తగ్గించడం కీలక పాత్ర పోషిస్తుంది. సిమెంట్ ప్లాస్టరింగ్ చేసేటప్పుడు సాధారణంగా 10 నుంచి 20 శాతం వృధా అవుతుంది. ఇది 8 శాతం మించకుండా చూసుకోవాలి, అవసరమైతే కిందపడిన సిమెంటును తిరిగి వాడుకోవచ్చు. టైల్స్ వృధా సైతం 2 శాతం లోపు ఉండేలా జాగ్రత్త పడాలి. స్లాబ్ పనులు, ఫ్లోరింగ్లో కాంక్రీట్ను వృధా చేయకుండా, లింటెల్, సన్షేడ్ వంటి వాటిలో వాడుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఇటుకలు కూడా వృధా కాకుండా చూసుకోవాలి, పగిలిన ఇటుకలను సైతం అవసరమైన చోట వాడుకునే ప్రయత్నం చేయాలి. ఇసుక విషయంలో, అవసరమైన చోట రోబో సాండ్, మరికొన్నిచోట్ల నది ఇసుకను వాడుకోవడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు.
ఎలక్ట్రికల్ పైపులను గోడలలో వేయడం కంటే స్లాబులోనే సాధ్యమైనంత వరకు వేసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. గోడలలో పైపులు వేయడానికి ఎక్కువ ఖర్చవుతుంది. ప్లాస్టరింగ్ ఎంత మందం ఉండాలో అంతే ఉండేలా, వైరింగ్ ఎక్కడ చేయాలనేది ముందే పక్కాగా ప్లాన్ చేసుకుంటే వృధా తగ్గుతుంది. నిర్మాణానికి ప్రస్తుతం కనిష్టంగా చదరపు అడుగుకు 2,000 రూపాయల నుంచి 2,200 రూపాయలు అవుతుంది. నాణ్యమైన బ్రాండెడ్ సిమెంట్, స్టీల్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, శానిటరీ సామాగ్రి, పెయింటింగ్ వంటివి వాడితే చదరపు అడుగుకు 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. అయితే నిపుణులు సూచించిన సూచనలను పాటిస్తే చదరపు అడుగుకు 200 నుంచి 300 రూపాయల వరకు ఆదా అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
నిర్మాణ సామాగ్రి ధరలు మార్కెట్లో హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. సిమెంట్ బస్తా కంపెనీని బట్టి 320 నుంచి 475 రూపాయల వరకు ఉంటుంది. ఇటీవల సిమెంట్పై 10 శాతం జీఎస్టీ తగ్గడం వల్ల చదరపు అడుగుకు 25 నుంచి 30 రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉంది. స్టీల్ టన్ను ధర 54 వేల నుంచి 67 వేల వరకు ఉంది. బ్రాండెడ్ స్టీల్ ధరలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. మార్కెట్లో నిర్మాణ సామాగ్రి ధరలు ఎక్కడ తక్కువగా ఉన్నాయో తెలుసుకొని, సరైన సమయంలో కొనుగోలు చేయడం ద్వారా నిర్మాణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. సమగ్రమైన ప్రణాళికతో, పర్యవేక్షణతో సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Ration Rice: పేదలకు గుడ్ న్యూస్.. ఇక 10 శాతం నూకలతో రేషన్ బియ్యం పంపిణీ..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి