
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బంగారం, వెండి, బిట్కాయిన్.. మూడింటినీ కలిపి పెట్టుబడులు పెట్టడం మంచిదేనని చెప్పిన ఆయన, మూడింటిలో ఒక్కదాన్నే ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తాను బిట్కాయిన్కే ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల్లో బిట్కాయిన్కు ఉన్న పరిమిత సరఫరానే దాని అతిపెద్ద బలమని వివరించారు. బంగారం ధర పెరిగినప్పుడు మరిన్ని గనులు తవ్వడం ద్వారా సరఫరా పెరిగే అవకాశం ఉందని, తాను స్వయంగా గోల్డ్ మైనర్ కావడంతో ఇది తనకు తెలుసని తెలిపారు.
గోల్డ్ రేట్ పెరిగితే మరిన్ని గనులు తవ్వుతారు. దాంతో సరఫరా పెరుగుతుంది. కానీ బిట్కాయిన్ విషయంలో అలా కాదు. దాని డిజైన్ ప్రకారం గరిష్టంగా 21 మిలియన్ బిట్కాయిన్లే ఉంటాయి అని కియోసాకి అన్నారు. 21 మిలియన్ల తర్వాత కొత్త బిట్కాయిన్లు రావు. ఇది అద్భుతమైన డిజైన్. అందుకే దీర్ఘకాలంలో బిట్కాయిన్ ధర పెరుగుతుందని నేను నమ్ముతున్నాను అని ఆయన తెలిపారు.
ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల నుంచి రక్షణనిచ్చే హార్డ్ అసెట్స్పైనే తాను నమ్మకం పెట్టుకుంటానని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. అయితే నిపుణులు మాత్రం కేవలం కొరత మాత్రమే ధరలు పెరగడానికి హామీ ఇవ్వదని, డిమాండ్, నియంత్రణలు, మార్కెట్ ఊగిసలాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి