
EMI Payments: దేశ ప్రజలకు ఆర్బీఐ నుంచి మరో గుడ్న్యూస్ వచ్చేందుకు రంగం సిద్దమైంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనుండగా.. రెపో రేటు తగ్గింపుపై ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ద్రవ్యోల్బణం తగ్గుతుండటం, జీడీపీ వృద్ది చెందిన క్రమంలో రెపో రేటు తగ్గించవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు శుభవార్తగా చెప్పవచ్చు. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంక్ లోన్ తీసుకున్నవారికి ఈఎంఐల భారం తగ్గుతుంది. దీని వల్ల చెల్లించాల్సిన వడ్డీ కూడా తగ్గుతుంది.
రేటింగ్ సంస్థ కేర్ఎడ్జ్ అంచనా ప్రకారం.. ఆర్బీఐ రేపో రేటను పాపు శాతం తగ్గించవచ్చని స్పష్టం చేసింది. జీడీపీ వృద్ది చెందటంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గుదలే దీనికి కారణంగా చెబుతోంది. మూడు రోజుల సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఈ నెల 5న ఆర్బీఐ ప్రకటించనుంది. ఈ నిర్ణయాల్లో రెపో రేటు తగ్గింపు ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రెపో రేటు 5.5 శాతంగా ఉండగా.. పావు శాతం తగ్గించవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. వర్షాలు విస్తరంగా పడుతుండటం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఉండటంతో ద్రవ్యోల్బణం పెరగకుండా ఇవి సహాయపడతాయని అంటున్నారు.
గతంలో జరిగిన సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును 5.5 వద్ద యథాతథంగా ఉంచింది. ద్రవ్యోల్బణం గణనీయంగా చల్లబడటంతో రేట్లలో మార్పులు చేయలేదని అప్పట్లో ఆర్బీఐ తెలిపింది. ఈ సంవత్సరం ఎంపీసీ రెపో రేటును 6.5 నుంచి 5.5 శాతానికి తగ్గించింది. అంటే 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రెండుసార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించగా..ఆ తర్వాత ఒకేసారి 50 పాయింట్లు తగ్గించింది. ఆ తర్వాత ఆగస్టు నుంచి స్థిరంగా ఉంటూ వస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి