
ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల క్రమంలో చాలామంది గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు. తక్కువ వడ్డీకే ఇది లభిస్తుండటంతో పాటు పేపర్ ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లోనే గోల్డ్ తాకట్టు పెట్టి ఇన్స్టంట్గా లోన్ పొందవచ్చు. అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరమైన సమయంలో ఎక్కువమంది తమ ఇంట్లో భద్రపర్చుకున్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. ఆ తర్వాత డబ్బులు ఉన్న సమయంలో వడ్డీతో సహా రుణం చెల్లించి తమ బంగారాన్ని తిరిగి ఇంటికి తెచ్చుకుంటారు. అయితే గోల్డ్ లోన్ తీసుకునే కస్టమర్లకు భద్రత కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఆండియా(ఆర్బీఐ) అనేక నిబంధనలు విధించింది. గోల్డ్ లోన్ తీసుకునేవారందరికీ ఇవి వర్తిస్తాయి.
మీరు గోల్డ్ లోన్ మొత్తం తిరిగి చెల్లించాక మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఏడు పనిదినాల్లో ఖచ్చితంగా బ్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకులు ఆలస్యం చేస్తే రోజుకు రూ.5 వేలు నష్టపరిహారం కస్టమర్కు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ ఈ మేరకు స్పష్టమైన నిబంధనలను రూపొందించింది. బ్యాంక్ వల్ల తప్పు జరగకపోతే సరైన కారణాన్ని కస్టమర్కు తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ రుణం చెల్లించాక కస్టమర్ బంగారం తీసుకెళ్లకపోతే బ్యాంక్ ఎస్ఎంఎస్, ఈమెయిల్, లేఖల ద్వారా సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ దగ్గర ఉన్నప్పుడు బంగారం దెబ్బతింటే మరమ్మత్తు ఖర్చులు బ్యాంకులే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వేలం వేసే సమయంలో దెబ్బతిన్నా పరిహారం అందించాల్సి ఉంటుందని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి.
ఇక బంగారాన్ని రెండు సంవత్సరాల వరకు కస్టమర్ తీసుకోకపోతే దానిని క్లెయిమ్ చేయని ఆస్తిగా బ్యాంకులు పరిగణిస్తాయి. అలాంటి సమయాల్లో బ్యాంకులు కస్టమర్, లీగల్ వారసులను సంప్రదిస్తాయి. ఇక బ్యాంక్ అంతర్గత కమిటీలు, బోర్డుకు వివరాలు అందిస్తాయి. ఇలా బ్యాంకులో ఉన్నప్పుడు బంగారం చోరీకి గురైన కస్టమర్కు పెద్ద మొత్తంలో పరిహారం అందించాల్సి ఉంటుంది. ఇలా మీరు బ్యాంకులో తాకట్టులో పెట్టే బంగారానికి రక్షణ, భద్రత కల్పించేందుకు ఆర్బీఐ అనేక రూల్స్ బ్యాంకులకు విధించింది. దీంతో గోల్డ్ లోన్ తీసుకునేవారు వీటి గురించి అవగాహన కలిగి ఉండాలి.