AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన కరెన్సీ నోట్లు మారబోతున్నాయ్‌..? సంచలన నిర్ణయం దిశగా RBI

డిజిటల్ చెల్లింపులు విస్తరిస్తున్నప్పటికీ నగదు వినియోగం కొనసాగుతున్న నేపథ్యంలో, ఆర్‌బీఐ రూ.10, రూ.20 నోట్లతో పాలిమర్ కరెన్సీ ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఎక్కువ మన్నిక, తక్కువ ముద్రణ వ్యయం, నకిలీ నిరోధకత వంటి ప్రయోజనాలతో ఈ మార్పు భారత కరెన్సీ వ్యవస్థలో కీలక సంస్కరణగా మారవచ్చు.

మన కరెన్సీ నోట్లు మారబోతున్నాయ్‌..? సంచలన నిర్ణయం దిశగా RBI
Rbi Eyes Polymer Currency N
SN Pasha
|

Updated on: May 31, 2026 | 6:36 AM

Share

దేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ నగదు వినియోగం ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తోంది. యూపీఐ, మొబైల్‌ పేమెంట్లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా రోజువారీ లావాదేవీల్లో కోట్లాది మంది ఇప్పటికీ కరెన్సీ నోట్లపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశ కరెన్సీ వ్యవస్థలో ఒక కీలక మార్పుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆర్‌బీఐ ప్రస్తుతం సంప్రదాయ కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ ఆధారిత పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తోంది. తొలి దశలో రూ.10, రూ.20 నోట్లను పాలిమర్ రూపంలో విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి రోజువారీగా అత్యధికంగా చేతులు మారే నోట్లు కావడంతో త్వరగా చిరిగిపోవడం, మురికిగా మారడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో పాలిమర్ నోట్లను తీసుకురావాలని ఆర్‌బీఐ భావిస్తోంది. ప్రస్తుతం కరెన్సీ ముద్రణ వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ప్రత్యేక భద్రతా లక్షణాలు, అధిక నాణ్యత కలిగిన కాగితం, సిరాల వినియోగం కారణంగా నోట్ల ముద్రణ ఖర్చులు భారీగా పెరిగాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో పాత, చిరిగిపోయిన నోట్లను ఉపసంహరించి వాటి స్థానంలో కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ బ్యాంకింగ్ వ్యవస్థపై అదనపు ఆర్థిక భారం మోపుతోంది.

పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి నీరు, తేమ, మురికి ప్రభావానికి తక్కువగా లోనవుతాయి. అలాగే నకిలీ నోట్ల తయారీని అడ్డుకునే అధునాతన భద్రతా లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. దీర్ఘకాలంలో ముద్రణ, నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో ఇవి సహాయపడతాయని అంచనా.

ఇప్పటికే ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాం, రొమేనియా వంటి దేశాలు పాలిమర్ నోట్లను విజయవంతంగా వినియోగిస్తున్నాయి. భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తే ప్రపంచంలోని ఆధునిక కరెన్సీ వ్యవస్థలను అనుసరించే దేశాల జాబితాలో చేరనుంది. అయితే పాలిమర్ నోట్ల ప్రవేశంపై ఆర్‌బీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భారత కరెన్సీ చరిత్రలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us