ఎగుమతిదారులకు RBI గుడ్‌న్యూస్‌! ఆ గడువు 450 రోజులకు పొడిగింపు

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, సరఫరా గొలుసు అంతరాయాల కారణంగా ఎగుమతిదారులకు ఆర్‌బీఐ ఊరట కల్పించింది. ప్రీ-షిప్‌మెంట్, పోస్ట్-షిప్‌మెంట్ రుణాల గడువును 450 రోజులకు పొడిగించింది. విదేశీ మారకద్రవ్యం తిరిగి తెచ్చే గడువును 15 నెలలకు పెంచింది. జూన్ 30 వరకు డెలివరీలకు ఈ సడలింపులు వర్తిస్తాయి.

ఎగుమతిదారులకు RBI గుడ్‌న్యూస్‌! ఆ గడువు 450 రోజులకు పొడిగింపు
Rbi

Updated on: Mar 31, 2026 | 9:32 PM

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసు అంతరాయాల నేపథ్యంలో RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించేలా ప్రీ-షిప్‌మెంట్, పోస్ట్-షిప్‌మెంట్ ఎగుమతి రుణాల గడువును 450 రోజులకు పొడిగిస్తూ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సడలింపు జూన్ 30 వరకు జరిగే అన్ని డెలివరీలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇంతకుముందు ఈ పొడిగింపు మార్చి 31 వరకు మాత్రమే అమల్లో ఉండగా, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరింత కాలం పాటు కొనసాగించాలని కేంద్ర బ్యాంకు నిర్ణయించింది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా రవాణా ఆలస్యం, సరుకు రవాణా ఖర్చుల పెరుగుదల, చెల్లింపుల జాప్యం వంటి సమస్యలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

అలాగే ఎగుమతుల ద్వారా వచ్చే విదేశీ మారకద్రవ్యాన్ని స్వదేశానికి రప్పించే గడువును కూడా పొడిగించిన పూర్వపు సడలింపులు కొనసాగుతాయని ఆర్‌బిఐ పేర్కొంది. సాధారణంగా తొమ్మిది నెలలుగా ఉన్న ఈ గడువును 15 నెలల వరకు పెంచడం ద్వారా ఎగుమతిదారులకు మరింత సమయం లభిస్తోంది. ఇది వస్తువులు, సాఫ్ట్‌వేర్, సేవల ఎగుమతులకు వర్తిస్తుంది.

ఈ నిర్ణయం వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఫ్యాక్టరింగ్ సేవలు అందించే ఎన్‌బీఎఫ్‌సీలు, అలాగే అఖిల భారత ఆర్థిక సంస్థలతో సహా ఎగుమతి ఫైనాన్స్‌లో పాల్గొనే అన్ని నియంత్రిత సంస్థలకు వర్తిస్తుంది. దీంతో ఎగుమతి రంగంలో పనిచేస్తున్న సంస్థలకు రుణ చెల్లింపుల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఈ చర్యల ముఖ్య ఉద్దేశ్యం, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం, లాభదాయకమైన ఎగుమతి వ్యాపారాల కొనసాగింపును నిర్ధారించడం అని RBI వెల్లడించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us