
చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శుభవార్త అందించింది. వీరికి ఇప్పటివరకు పూచీకత్తు లేకుండా అందిస్తున్న బ్యాంకు రుణాల పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి మొదలైన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఇప్పటివరకు మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వ్యాపారాలకు రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణం అందిస్తున్నారు. దీనిని ఇప్పుడు రూ.20 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో చిన్న వ్యాపారులు చేసేవారికి ఎలాంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు లోన్ పొందే అవకాశం లభించనుంది.
కొత్తగా లోన్ తీసుకునేవారితో పాటు వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేసుకునేవారికి కూడా రూ.20 లక్షల వరకు పూచీకత్తు ఉండదు. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. చిన్న వ్యాపారాలు, స్టార్టప్స్ కంపెనీలకు ఈ నిర్ణయంతో ఎంతో ప్రయోజనం కలగనుంది. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మల్ ఎంటర్ప్రైజెస్ పథకం ద్వారా ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. అటు పీఎం ముద్ర యోజన కిం వ్యాపారులు పొందే రుణాన్ని రూ.20 లక్షల వరకు కేంద్రం పెంచిన విషయం తెలిసిందే.
వ్యాపారులకు పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాన్ని కొల్లాటరల్ ఫ్రీ బిజినెస్ లోన్ అని పిలుస్తారు. వ్యాపారులకు వర్కింగ్ క్యాపిటల్, యంత్రాల కొనుగోలు కోసం ఈ లోన్ మంజూరు చేస్తారు. దీనిని ఆన్ సెక్యూర్డ్ లోన్ అంటారు. అంటే ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండానే లోన్ మంజూరు చేస్తారు. దీనిని ఇప్పుడు రూ.20 లక్షలకు పెంచడంతో చిన్న వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణాలు బ్యాంకులు మంజూరు కానున్నాయి. అలాగే వేగవంతంగా రుణాలు మంజూరు కానున్నాయి.