Petrol, Diesel: ఇలా అయితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.. వెంటనే పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచాలి ప్రభుత్వాన్ని కోరిన ఎఫ్‌ఐపీఐ..

|

Jun 20, 2022 | 12:53 PM

అంతర్జాతీయంగా ముడిచమురు ధర బాగా పెరిగినా, దేశీయంగా ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలు పెంచనందున లీటరు డీజిల్‌ విక్రయంపై రూ.20-25, పెట్రోల్‌పై రూ.14-18 మేర నష్టం వస్తోందని చమురు మార్కెటింగ్‌ ప్రైవేటు సంస్థల సంఘం వివరించింది...

Petrol, Diesel: ఇలా అయితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.. వెంటనే పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచాలి ప్రభుత్వాన్ని కోరిన ఎఫ్‌ఐపీఐ..
Follow us on

అంతర్జాతీయంగా ముడిచమురు ధర బాగా పెరిగినా, దేశీయంగా ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలు పెంచనందున లీటరు డీజిల్‌ విక్రయంపై రూ.20-25, పెట్రోల్‌పై రూ.14-18 మేర నష్టం వస్తోందని చమురు మార్కెటింగ్‌ ప్రైవేటు సంస్థల సంఘం వివరించింది. జియో-బీపీ, నయారా ఎనర్జీ, షెల్‌ వంటి ప్రైవేటు సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ పెట్రోలియం ఇండస్ట్రీ , ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ సంస్థలనూ తన సభ్యులుగానే పరిగణలోకి తీసుకుంటుంది. చమురు ధరలకు అనుగుణంగా రిటైల్‌ ధరలను సవరించకపోతే, రిటైలింగ్‌ వ్యాపారంలోకి మరిన్ని పెట్టుబడులు పెట్టలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖకు ఎఫ్‌ఐపీఐ లేఖ పంపింది. సత్వరం జోక్యం చేసుకుని, సంస్థలు మనుగడ సాగించేలా, పెట్టుబడులు వచ్చేలా చూడాలని కోరింది. ముడిచమురు ధర దశాబ్దంలోనే గరిష్ఠస్థాయికి చేరినా, దేశ ఇంధన విపణిలో 90 శాతం వాటా కలిగిన ప్రభుత్వరంగ చమురు సంస్థలు మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచలేదని గుర్తు చేసింది.

చమురు ధరలో మూడింట రెండువంతులకు సమానంగా ప్రస్తుత రిటైల్‌ ధరలున్నాయని వివరించింది. ఒకవేళ ప్రైవేటు సంస్థలు మాత్రమే ధరలు పెంచితే, కొనుగోలుదారులు దూరమవుతారని.. అందుకే నష్టాలు తగ్గించుకునేందుకు అమ్మకాలు పరిమితం చేసుకోవాల్సి వస్తోందని పేర్కొంది. 2021 నవంబరు నుంచి 2022 మార్చి 21 మధ్య 137 రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరలు సవరించనందున నష్టాలు వచ్చాయని తెలిపింది. మళ్లీ 2022 మార్చి 22 నుంచి 14 రోజుల పాటు ధరలు సవరించి, లీటరుకు రూ.10 చొప్పున మాత్రమే పెంచినట్లు, ముడిచమురు అధిక ధరల వల్ల లీటరు డీజిల్‌పై రూ.20-25, పెట్రోల్‌పై రూ.14-18 చొప్పున నష్టపోతున్నట్లు ఎఫ్‌ఐపీఐ వాపోయింది.